కేటగిరీల వారీగా నోటిఫై చేయలేదని ఆశావహుల ఆందోళన
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 6,511 పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల వారీగా విభజన (నోటిఫై) చేయలేదని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. భర్తీ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగే ప్రమాదముందని ఆయా వర్గాల అభ్యర్థులు వాపోతున్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, డీఎస్సీ తదితర నియామక సంస్థలన్నీ... ఉద్యోగాల భర్తీకి ఇచ్చే నోటిఫికేషన్లలోనే ఏయే కేటగిరీ వారికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో వివరంగా ఇస్తాయి. కేంద్ర భద్రత బలగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో కేటగిరీల వారీగా పోస్టులను నోటిఫై చేశారు. ఏపీ పోలీసు నియామక మండలి ఇప్పటివరకు జారీచేసిన ఏ నోటిఫికేషన్లోనూ పోస్టులను విభజించలేదు. ఫలితంగా తమ రిజర్వేషన్ శాతానికి అనుగుణంగా ఉద్యోగాలు లభించలేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈసారి ప్రకటనలోనైనా కేటగిరీల వారీగా పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వానికి, డీజీపీకి, పోలీసు నియామక మండలికి లేఖలు రాసినా తమ వినతిని పరిగణనలోకి తీసుకోలేదని వారు అంటున్నారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి పోస్టులను రిజర్వేషన్ల వారీగా నోటిఫై చేయాలని కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.