• facebook
  • whatsapp
  • telegram

Women Versity: కాగితాల్లోనే మహిళా వర్సిటీ

ప్రభుత్వ ప్రకటనపై ముందుకు పడని అడుగు
విశ్వవిద్యాలయాలకు గత బడ్జెట్‌లో ప్రకటించిన నిధుల్లో అరకొరే విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని గత బడ్జెట్‌లో ప్రకటించినా అమలులో కనిపించడం లేదు. మళ్లీ కొత్త బడ్జెట్‌ వస్తున్నా గతంలో చెప్పిన దాంట్లో కొంతే చేశారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. ఇక విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి పనులకు ఒక్క రూపాయీ ఇవ్వకపోగా.. సిబ్బంది వేతనాల కోసం కేటాయించిన బ్లాక్‌ గ్రాంట్‌ కూడా ఇప్పటికీ పూర్తిగా విడుదల కాలేదు.
మహిళలకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మహిళా వర్సిటీని నెలకొల్పుతామని గత జనవరిలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందుకనుగుణంగా గత ఏడాది మార్చి 7వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించారు. కళాశాలలను విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరించాలంటే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలి. కానీ, ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో బిల్లు పెట్టలేదు. ఫలితంగా వర్సిటీగా మారలేదు. విశ్వవిద్యాలయంగా మార్చే ప్రక్రియలో భాగంగా ప్రత్యేక అధికారిని నియమించాల్సి ఉన్నా చేపట్టలేదు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.100 కోట్లు ఇచ్చినా కొన్ని భవనాల నిర్మాణాలు కొనసాగేవి. ఇప్పటివరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. వచ్చే బడ్జెట్‌లోనైనా నిధులు విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కళాశాల సిబ్బంది ఇటీవల వినతిపత్రం సమర్పించడం గమనార్హం.
బ్లాక్‌ గ్రాంట్‌ నిధుల విడుదలలోనూ..
విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. తెలుగు, ఆర్కిటెక్చర్‌ లాంటి కొన్ని వర్సిటీలకు మాత్రమే సిబ్బంది వేతనాలకు పూర్తిగా బడ్జెట్‌ ఇస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలకు ఇవ్వడం లేదు. గత బడ్జెట్‌లో కేటాయించిన బ్లాక్‌ గ్రాంట్‌ నిధులను ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదు. ఉదాహరణకు పాలమూరు విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్‌లో రూ.9.85 కోట్లు ప్రకటించగా.. ఇప్పటివరకు రూ.4.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా 55 శాతం నిధులు రావాల్సి ఉంది. మరికొన్ని వర్సిటీల పరిస్థితి ఇలాగే ఉందని తెలుస్తోంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి రూ.25.82 కోట్లు కేటాయించగా..ఇప్పటివరకు రూ.22 కోట్లు అందాయని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.