• facebook
  • whatsapp
  • telegram

Scholarship: చదువుతూనే నెలకు రూ.10 వేల వేతనం

* డిగ్రీ విద్యార్థులకు ‘ఇంటర్న్‌షిప్‌’ వరం

* 103 కళాశాలల్లో 10 కోర్సుల గుర్తింపు

* వాటిలో చేరితే వారానికి 3 రోజులు   చదువు, 3 రోజులు కొలువు

* కొత్త విద్యా సంవత్సరం నుంచే అమలు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో ఒకవైపు చదువుకుంటూనే వివిధ దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేస్తూ విద్యార్థులు కొంత మొత్తాన్ని సంపాదించడం అందరికీ తెలుసు. అదే తరహాలో డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి నెల నుంచే రూ.10 వేల వేతనం అందుకునే అవకాశం మన రాష్ట్రంలోని విద్యార్థులకూ ఎంతో దూరంలో లేదు. ఈ కొత్త విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచే 103 కళాశాలల్లో ప్రారంభించాలని తెలంగాణ‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అవసరమైన కసరత్తును దాదాపు పూర్తి చేసింది. అధికారులే ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఎంపిక చేస్తారు. విద్యార్థులు వారంలో 3 రోజులు కళాశాలలో పాఠాలు వినాల్సి ఉంటుంది. మరో 3 రోజులు పని చేయాల్సి ఉంటుంది.

37 ప్రభుత్వ, 66 ప్రైవేటు కళాశాలలు

రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, 66 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల సంఖ్య 500 మందికి మించి ఉండాలనే నిబంధన పాటించారు. అయితే వీటిలో ఉన్న అన్ని కోర్సుల్లో కాకుండా... ఎంపిక చేసిన పది కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే రూ.10 వేల వేతనం ఇచ్చే సౌలభ్యం వర్తిస్తుంది. బీబీఏ(రిటైలింగ్‌), బీబీఎస్‌(ఈ-కామర్స్‌), బీబీఏ(లాజిస్టిక్స్‌), బీఎస్‌సీ(ఫిజికల్‌ సైన్స్‌), బీఏ(కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌)లో చేరిన వారికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీటితోపాటు బీకాం (ఈ-కామర్స్‌), బీకాం (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌)తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సుల వరకు కొత్త విధానంలోకి తీసుకోవాలన్నది విద్యామండలి లక్ష్యంగా కనిపిస్తోంది. కాకపోతే ఒక్కో కళాశాలలో ఒకటీ లేదా రెండు కోర్సులకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు.

పేద తల్లిదండ్రులపై భారం ఉండదు


ఎంతో మంది పేద విద్యార్థులు ‘దోస్త్‌’తో హైదరాబాద్‌, ఇతర నగరాలకు వచ్చి పేరెన్నికైన డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. వారికి హాస్టల్‌, ప్రయాణ, ఇతర ఖర్చులు భారంగా మారుతున్నాయి. దానికితోడు డిగ్రీ పూర్తయితే చదువుకు తగ్గ కొలువును సాధించుకోవచ్చన్న నమ్మకాన్ని ప్రస్తుతం వారికి ఇవ్వలేకపోతున్నాం. ఈ పరిస్థితిని మార్చేందుకే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) సహకారం తీసుకుంటున్నాం. వారంలో మూడు రోజులపాటు పరిశ్రమలు, ఇతర స్టోర్లలో పనిచేస్తే ఆ హాజరును పరిగణనలోకి తీసుకుంటాం. మొత్తానికి పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పడంతోపాటు విద్యార్థులకూ కొలువుకు తగిన నైపుణ్యాన్ని సాధించామన్న ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వగులుగుతాం.  - ఆర్‌.లింబాద్రి, ఛైర్మన్‌, ఉన్నత విద్యామండలి

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్పు కోరిన మరో పోరాటం!

‣ జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల

‣ మరో మూడు ఉద్యోగ నోటిఫికేష‌న్ల పూర్తి వివ‌రాలు విడుద‌ల‌

‣ ఇంకా 20 రోజులే..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.