• facebook
  • whatsapp
  • telegram

NEET: ‘నీట్‌’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం  

* ఆ వ్యాజ్యంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన హైకోర్టు 


ఈనాడు, అమరావతి: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) రాసే వారికి ‘ప్రవేశ ఏడాది డిసెంబరు 31’ నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలనే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ వ్యవహారాన్ని ఉమ్మడి హైకోర్టు 2013, 2017లోనే తేల్చిందని గుర్తు చేసింది. కనీస వయసు 17 ఏళ్లుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును నిరాకరించినట్లు కాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపింది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉండదని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీట్‌ రాసేందుకు కనీసం 17 ఏళ్లు ఉండాలన్న భారత వైద్య మండలి నిబంధన 4(1)ని కొట్టేయాలంటూ కడపకు చెందిన 16 ఏళ్ల బాలిక తండ్రి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆ నిబంధనతో సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛలను ఉల్లంఘించడమేనన్నారు. బాలికకు కేవలం 4 రోజులు మాత్రమే తగ్గుతున్నాయని, నీట్‌ రాసేందుకు అనుమతించాలని కోరారు. జాతీయ వైద్య కమిషన్‌ తరఫున న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటి సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసిందన్నారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రస్తుత వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఎన్ని రోజులు తగ్గాయనేది అప్రస్తుతమని, ఒక్క రోజు తగ్గినా మేమేం చేయలేం అని వ్యాఖ్యానించింది. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.