కృష్ణా జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి సీఎస్ఈ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి. టాప్ కళాశాలల నుంచి ఓ మోస్తరుగా ఉండే వాటి వరకూ అన్నింటిలోనూ సీఎస్ఈ చాలావరకూ నిండిపోయాయి. కళాశాలతో సంబంధం లేకుండా సీటు దొరికితే చాలు.. చేరిపోయారు. కళాశాలలు డిమాండ్ నేపథ్యంలో విచ్చలవిడిగా ఫీజు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాత్రం ఉన్న సీట్లన్నీ నిండిపోయాయి. 768 సీట్లు ఉంటే.. అన్నీ భర్తీ అయిపోయాయి. సీఎస్ఈకి అనుబంధంగా ఉండే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటాసైన్స్ లాంటి సీట్లకూ ఈసారి డిమాండ్ పెరిగింది. సీఎస్ఈ చేస్తేనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం ఇంటర్ కళాశాలల స్థాయిలో విస్తృతంగా ఈసారి జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేలంవెర్రిగా చేరిపోయినట్టు తెలుస్తోంది.
అంతా అటువైపే: డాక్టర్ ఎన్.వి.సురేంద్రబాబు, ఏపీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీషర్స్ కన్సార్టియమ్ ప్రధాన కార్యదర్శి
సీఎస్ఈలో సీట్లు దొరకని సమయంలోనే మిగతా వాటిని చాలామంది ఎంపిక చేసుకున్నారు. ఇంజినీరింగ్లో కోర్ బ్రాంచ్లలో చేరే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగంలో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేవలం సీఎస్ఈ చేస్తేనే సాఫ్ట్వేర్ రంగంలోనికి వెళ్లొచ్చనే భావనలో ఉండడం వల్ల ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలోనూ సీఎస్ఈ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడం కనిపిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.