ప్రస్తుతం వేర్వేరుగా నియామక సంస్థల ప్రకటనలు
ఉద్యోగాల భర్తీలో జాప్యం.. అభ్యర్థులకు తప్పని ఆర్థిక భారం
ఉమ్మడి ప్రవేశ పరీక్షతో సత్వరంగా ప్రక్రియ
కేంద్ర ఉద్యోగాల సత్వర భర్తీ కోసం రెండేళ్ల క్రితం ప్రతిపాదించిన ‘జాతీయ నియామక సంస్థ’(నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ-ఎన్ఆర్ఏ) పరీక్ష నేటికీ కార్యరూపం దాల్చలేదు. జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో బోర్డుల ఏర్పాటులో ఆలస్యం, ఉమ్మడి సిలబస్ ఖరారులో జాప్యం తదితర కారణాలతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆలస్యమవుతోంది. ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), బ్యాంకు ఉద్యోగాల ఎంపిక బోర్డు(ఐబీపీఎస్) తదితర కేంద్ర నియామక సంస్థలు సొంతంగా నియామక ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో నాన్గెజిటెడ్, క్లరికల్, నాన్టెక్నికల్(గ్రూప్ బీ, సీ, డీ) పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
ఎన్ఆర్ఏ ఎందుకంటే..
దేశవ్యాప్తంగా ఏటా 1.25 లక్షల ఉద్యోగాల కోసం 50కిపైగా నియామక సంస్థలు ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షలకు 2.5 కోట్ల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించి, నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం ఏడాదిన్నరకు పైగా సమయం పడుతోంది. వేర్వేరు పరీక్షలకు ఫీజు రూపేణా నిరుద్యోగులు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్ఆర్ఏ ఉమ్మడి ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సాధించిన మార్కులు(స్కోరు) కటాఫ్ ఆధారంగా ఎస్ఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ తదితర నియామక బోర్డులు తుది ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానించి, రాత పరీక్ష నిర్వహిస్తాయి. ఎన్ఆర్ఏ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభ్యర్థి తాను ఎంచుకున్న పరీక్ష కేంద్రంలో, కోరుకున్న తేదీన పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షను ఎన్నిసార్లయినా రాయవచ్చు. ఒకసారి అర్హత సాధించిన తరువాత చెల్లుబాటయ్యే గడువులోగా(మూడేళ్లు) మరో రెండుసార్లు స్కోరు పెంచుకోవచ్చు. అత్యుత్తమ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు. ఉమ్మడి పరీక్ష వల్ల నియామక సంస్థలపై నిర్వహణ భారం, నిరుద్యోగ అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గుతాయి.
ఇంకా ఖరారు కాని సిలబస్..
విద్యార్హత ఒకటే అయినా.. నియామక సంస్థల పరీక్షలకు వేర్వేరు సిలబస్ ఉంటోంది. అన్ని పరీక్షలకు ఒకే విధమైన ఉమ్మడి సిలబస్ ఉండాలని ఇప్పటికే యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. దీన్ని ఎన్ఆర్ఏ ఆమోదించినప్పటికీ ఉమ్మడి సిలబస్పై రెండేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల ఉమ్మడి సిలబస్పై నిపుణుల కమిటీని, బోర్డుకు ఛైర్మన్ను, ఇతర సభ్యులను నియమించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!
‣ డీజే కావాలని అనుకుంటున్నారా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.