జులై మొదటివారంలోగా కార్యాచరణ నివేదిక ఇవ్వండి
ఉద్యోగ క్యాలెండర్పై సమీక్షలో సీఎం జగన్ ఆదేశం
2021-22లో అన్ని శాఖల్లో 39,654 కొలువులిచ్చామని వెల్లడి
ఈనాడు, అమరావతి: పోలీసు ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థిక శాఖాధికారులు కలిసి వీలైనంత త్వరగా ఈ ప్రణాళిక సిద్ధం చేసి, జులై మొదటి వారంలోగా తనకు నివేదించాలని సూచించారు. ఆ కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జూన్ 17న ఆయన ఉద్యోగ క్యాలెండర్పై సమీక్ష నిర్వహించారు. 2021-22లో అన్ని ప్రభుత్వ శాఖల్లో 39,654 పోస్టులు భర్తీ చేశామన్నారు. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో మిగిలిన 8 వేల పోస్టుల నియామకాలకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో మిగతా ఉద్యోగాలను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యా శాఖలోని అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీ కొలువులను వచ్చే మార్చి లోగా భర్తీ చేయాలని ఆదేశించారు.
‣ ‘విద్య, వైద్యంపై చాలా డబ్బులు వెచ్చించి ఆసుపత్రులు, విద్యాలయాలు నిర్మిస్తున్నాం. వాటిలో ఖాళీలు నింపకపోతే ప్రజలకు ప్రయోజనాలు అందవు. రెగ్యులర్ ఉద్యోగాలయినా, కాంట్రాక్టు పోస్టులైనా నియామకాలు పారదర్శకంగా జరగాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నాం. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది’ అని సీఎం వివరించారు.
39,310 పోస్టులు వైద్యారోగ్య శాఖలోనే
‘2021-22లో 39,654 పోస్టులు భర్తీ చేశాం. వాటిలో ఒక్క వైద్యారోగ్య శాఖలోనే 39,310 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జాబ్ క్యాలెండర్లో మొత్తం 47,465 పోస్టులు గుర్తించగా 83.5 శాతం నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. మరో 8 వేల పోస్టులు (16.5%) ఇంకా భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఇందులో వైద్యారోగ్య శాఖలోని పోస్టులే 1198 ఉన్నాయని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.