* హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు
ఈనాడు, అమరావతి: గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపిస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలుచేశారు. ‘‘2018 నోటిఫికేషన్కు సంబంధించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను స్కాన్ చేసి ‘డిజిటల్’ విధానంలో దిద్దినట్లు, ప్రత్యేక షీట్లో మార్కులు వేసినట్లు ఏపీపీఎస్సీ గతంలో సింగిల్ జడ్జికి తెలిపింది. జబాబుపత్రాలతో ఉన్న ఓఎంఆర్ షీట్లను డిజిటల్ మూల్యాంకనంలో వినియోగించలేదని తేటతెల్లమవుతోంది. ఆ ఓఎంఆర్ షీట్లను 2021 డిసెంబరు- 2022 ఫిబ్రవరి మధ్య జరిగిన తొలి మాన్యువల్ మూల్యాంకనంలో వినియోగించారు. రెండోసారి దిద్దించే నిమిత్తం పూర్వం ఉన్న బార్కోడ్తోనే కొత్త ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్ స్లిప్పుల ముద్రణ కోసం డేటాటెక్ మెథడిక్స్ ప్రైవేట్ సంస్థకు ఏపీపీఎస్సీ 2022 ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. మొత్తం 49,000 ఓఎంఆర్ బార్ కోడ్ షీట్లు, 6,300 కంట్రోల్ బండిల్ స్లిప్పులు ఆర్డర్ చేసింది. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి ఫిబ్రవరి 2న.. డేటాటెక్ సంస్థకు ఇచ్చిన వర్క్ ఆర్డర్లో (స్కానింగ్, తదితర ప్రక్రియ) జవాబుపత్రాలను ఓసారి దిద్దడం పూర్తయిందని, మరోసారి దిద్దే ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తవుతుందని ప్రస్తావించారు. మూల్యాంకనం తర్వాతి ప్రక్రియను చేపట్టాలని కోరారు. లేఖలోని అంశాలను బట్టి.. తొలి మాన్యువల్ మూల్యాంకనం ఫిబ్రవరి రెండో వారానికే పూర్తయిందని స్పష్టమవుతోంది.
మళ్లీమళ్లీ మూల్యాంకనానికి వీల్లేదు
రెండోసారి దిద్దిన తర్వాత ఫలితాలు, నియామకాలు చేపట్టారు. ఒక్కసారే మాన్యువల్ విధానంలో జవాబుపత్రాలు దిద్దాలని హైకోర్టు ఆదేశించాక మళ్లీమళ్లీ చేయడానికి వీల్లేదు. నచ్చినవారు ఎంపికయ్యేంత వరకు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధం. గ్రూప్-1 ప్రధాన పరీక్షకు 6,807 మంది అభ్యర్థులు హాజరై అన్ని (ఏడు) సబ్జెక్టులు రాస్తే 47,649 జవాబుపత్రాలు ఉండాలి. ప్రతి జవాబుపత్రానికి ఒక ఓఎంఆర్ షీటు ఉండాలి. అభ్యర్థులకు 47,649 యూనిక్ ఓఎంఆర్ షీట్లు ఉండాలి. కానీ 49,000 ఓఎంఆర్ షీట్లకు ఏపీపీఎస్సీ ఎందుకు ఆర్డర్ చేసింది. పైగా 48,442 మాత్రమే వినియోగించినట్లు బిల్లుల చెల్లింపుల ద్వారా తేలింది. వెయ్యి ఓఎంఆర్ షీట్లు అదనంగా ముద్రించినట్లు అర్థమవుతోంది. వాటిని కావాల్సినవారిని ఎంపిక చేసుకునేందుకు వినియోగించినట్లు స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పట్టు పట్టు.. ప్రిలిమ్స్ హిట్!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.