ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్ ఐచ్ఛికాల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా సుమారు 9 వేల బీటెక్ కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఆయా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పదుల సంఖ్యలో కళాశాలలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకొని కంప్యూటర్ సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్, ఈసీఈ తదితర బ్రాంచీల్లో పెంచుకున్నాయి. మరికొన్ని కళాశాలలు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు ఉన్నందున సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఏఐసీటీఈ నుంచి ఆమోదం పొందాయి. అలాంటి సీట్లు దాదాపు 9 వేల వరకు ఉన్నాయి. కొత్త సీట్ల వల్ల బోధన రుసుం పెరుగుతుందని, ఆర్థిక భారం పడుతుందని భావించిన జేఎన్టీయూహెచ్ ప్రభుత్వ అనుమతి కోసం దస్త్రాన్ని పంపినట్లు తెలిసింది. ఎంసెట్ వెబ్సైట్లో మాత్రం ఆయా బ్రాంచీల్లో తగ్గిన సీట్లను చూపించారు తప్ప.. ఆ మేరకు పెరగాల్సిన వాటిని చూపలేదు.
‣ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి సెప్టెంబరు 2 వరకు అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం చివరి రోజు ఆమోదం తెలిపి విద్యార్థులు జాగ్రత్త వహించకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు ఒక ప్రముఖ కళాశాలలో ఈఈఈలో 120 సీట్లలో 60 తగ్గించుకొని... వాటి స్థానంలో సీఎస్ఈ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారనుకుందాం. విద్యార్థులు ఆ కళాశాలలో డేటా సైన్స్ లేదని మరో కళాశాలలో ఆప్షన్ ఇచ్చుకుంటే ప్రముఖ కళాశాలలో డేటా సైన్స్కు ఆప్షన్ ఇవ్వనందున అక్కడ సీటు వచ్చే అవకాశం ఉండదు. అందుకే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని త్వరగా తేల్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.