* సెప్టెంబరు 5 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం
ఈనాడు, అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబరు ఐదో తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. రిజిస్ట్రేషన్, విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కళాశాలలు, కోర్సుల ఎంపికపై వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆగస్టు 28 నుంచి విద్యార్థులకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. ఇది వాయిదా పడింది. కాకినాడ, అనంతపురం జేఎన్టీయూల పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికాలేదు. ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ ఫలితాలు రాలేదు. కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు ఫీజులు భారీగా పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో కనీసం 25శాతమైనా చెల్లించాలని వర్సిటీ ఆదేశించింది. చాలా కాలేజీలు చెల్లించకపోవడంతో అనుబంధ గుర్తింపు జారీని నిలిపివేసింది. దీంతో కొన్ని కళాశాలలతో కూడిన జాబితానే సాంకేతిక విద్యాశాఖకు చేరింది. ఈ కారణాల రీత్యా రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. ఇప్పటి వరకు 79,864 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.