ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆగస్టు 28న ప్రశాంతంగా ముగిసింది. భౌతికశాస్త్రం, గణితంలో ప్రశ్నలు మధ్యస్థంగా, రసాయనశాస్త్రంలో సులభంగా ఉన్నాయని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు సబ్జెక్టుల్లోనూ 20 శాతం ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కలిపి 360 (180+180) మార్కులకు పరీక్ష జరిగింది. తెలంగాణలో 14, ఏపీలో 28 కేంద్రాల్లో కలిపి దాదాపు 25 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అంచనా.
‣ పేపర్-1లో మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు వచ్చాయి. మొదటి సెక్షన్లో నెగిటివ్ మార్కులు లేవు. రెండో సెక్షన్లో ప్రతి రెండు తప్పులకు ఒక నెగిటివ్ మార్కు, మూడో సెక్షన్లో ప్రతి తప్పునకు ఒక నెగిటివ్ మార్కు కేటాయించారు. పేపర్-2లోనూ మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు ఉంటాయి. అయితే పేపర్-1 కంటే ఎక్కువ నెగిటివ్ మార్కులు ఉండటంతో విద్యార్థులు ఆచితూచి జవాబులు ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ సమయం వృథా అయినట్లు చెబుతున్నారు.
‣ ‘‘పేపర్-1 కంటే పేపర్-2 కొంచెం తేలికగా ఉంది. రెండింటిలోనూ సెక్షన్-2 మంచి మార్కులు, ర్యాంకులు సాధించేందుకు కీలకం కానుంది’’ అని శ్రీచైతన్య విద్యాసంస్థల అఖిల భారత ఐఐటీ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్ విశ్లేషించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 70-75 మధ్య కటాఫ్ మార్కులు ఉండే వీలుందన్నారు.
‣ ‘‘రెండు పేపర్లనూ విశ్లేషిస్తే రసాయనశాస్త్రం బాగా తెలిసిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వచ్చే వీలుంది. గణితం బాగా చేసి ఉంటే టాప్ ర్యాంకులు సాధించే అవకాశం ఉంది’’ అని నానో అకాడమీ మైక్లాస్రూం దక్షిణ భారతదేశ హెడ్ కాసుల కృష్ణచైతన్య విశ్లేషించారు.
సాంకేతిక సమస్యలు..
ప్రశ్నలు చదవడం, స్క్రీన్ చూసే విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విద్యార్థులు తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ వెడల్పు తక్కువగా ఉండటంతో ప్రశ్నలు, బొమ్మలు ఒకేసారి కనిపించక మాటిమాటికీ మౌస్ సాయంతో స్క్రీన్ను ఎక్కువసార్లు స్క్రోల్ చేయాల్సి వచ్చిందని, దీంతో సమయం వృథా అయిందని వాపోయారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్ఆర్ఐ కోటా!
‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ
‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.