ఈ సరళిని మార్చాలి
దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ వి.రాంగోపాల్రావు సూచన
ఈనాడు, దిల్లీ: ఇంజినీరింగ్లో విద్యార్థులంతా ఐటీ, కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకే పరిమితమైపోతుండటంపై దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ వి.రాంగోపాల్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన దిల్లీ ఐఐటీ పోర్టల్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నేను సందర్శించిన ప్రతి విద్యా సంస్థదీ ఒకే కథ. కంప్యూటర్ సైన్స్, ఐటీ మినహా మిగిలిన కోర్సుల్లో మూడో వంతు సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఎలక్ట్రానిక్స్ తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. సివిల్, మెకానికల్ కోర్సుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ డిపార్ట్మెంట్లలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న బోధనా సిబ్బందిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కళాశాలలు ఉన్నాయి. ప్రతి విద్యార్థీ ఐటీ/సీఎస్ఈనే చదివితే, ప్రతి కంపెనీ ఈ-కామర్స్, ఐటీ ఆధారిత ఉత్పత్తులను మాత్రమే తయారు చేస్తే పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయి? వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, మౌలిక వసతులు, రవాణా, వ్యర్థాల శుద్ధి, సెమీకండక్టర్లు, డ్రోన్ సాంకేతికతో పాటు, ఇంకా ఎన్నో రంగాల్లో దేశం కోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాల గురించి నేటి తరానికి అర్థమయ్యేలా ఏఐసీటీఈ, యూజీసీ లఘు చిత్రాలు నిర్మించి విడుదల చేయాలి. పిల్లలకు విద్యార్థులను దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలకు తీసుకెళ్లి అక్కడ ఆధునిక మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ ల్యాబ్లు ఎలా పని చేస్తున్నాయన్నది చూపాలి. పరిస్థితులను మార్చడానికి జాతీయ స్థాయిలో చొరవ చూపాల్సిన సమయం ఇదే’’ అని రాంగోపాల్రావు పేర్కొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.