* మంత్రి హరీశ్రావు వెల్లడి
ఈనాడు, సంగారెడ్డి: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు చెప్పారు. తెలంగాణ రాకముందు ఇది కేవలం రూ.360 కోట్ల లోపే ఉండేదన్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ చదువుకునేలా అన్ని గురుకులాల స్థాయిని పెంచామన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నతంగా రాణిస్తున్నారన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్య, పీజీ కోర్సుల బోధనకు మహిళా గురుకుల కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్ 24న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మొగుడంపల్లిలో గిరిజన బాలికల గురుకులాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గతంలో అన్ని గురుకులాలు కలిపి 298 ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక ఆ సంఖ్య 980కి చేరింది. గిరిజన గురుకులాల్నే 103 అందుబాటులోకి తెచ్చాం. ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చుచేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినికి రూ.వెయ్యి బహుమతి
ఈ సందర్భంగా అక్కడి విద్యార్థినులకు మంత్రి హరీశ్రావు క్విజ్ పోటీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది, గిరిజన సంక్షేమ మంత్రి ఎవరు, లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి, ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం సాయం అందిస్తున్న పథకాల పేర్లేంటి.. ఇలా దాదాపు 15 ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ అందరూ చకచకా సమాధానాలిచ్చారు. చివరగా కొండాపూర్ మండలం మాచేపల్లికి చెందిన విద్యార్థిని రాధను.. మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టు పేరేంటని అడిగారు. ఆమె సింగూరు అని ఠక్కున సమాధానమివ్వడంతో దసరాకు కొత్త దుస్తులు కొనుక్కో అంటూ హరీశ్రావు రూ.1000 అందించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.