* విదేశాలకు వెళ్లనవసరం లేదు
* ఈ ఏడాది 1,200 ఎంబీబీఎస్ సీట్ల రాక
* అందుబాటులో మొత్తం 6,540 సీట్లు
* ఇది దసరా పండగ శుభవార్త: హరీశ్రావు
ఈనాడు,హైదరాబాద్: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తంగా వాటి సంఖ్య 6,540కి చేరిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలోనే పుష్కలంగా వైద్య సీట్లు ఉండడంతో.. వాటి కోసం రాష్ట్ర విద్యార్థులు ఇక పొరుగు రాష్ట్రాలకు.. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇది వైద్య విద్యార్థులకు, తల్లిదండ్రులకు దసరా పండగ శుభవార్త అని పేర్కొన్నారు. 70 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు మూడు వైద్య కళాశాలలు వస్తే.. గత ఏడేళ్లలోనే కొత్తవి 17 తెచ్చుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను, నర్సింగ్ కాలేజీని నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారనీ, రూ.4,080 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. కొత్త కళాశాలల రాకతో 650 పడకల ఆసుపత్రి, 30 రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు పేదలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అక్టోబరు 3న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 850 ఎంబీబీఎస్ సీట్లుండగా.. ఇప్పుడు 2,901కి పెంచుకున్నాం. అంటే 2,052 సీట్లు అదనం. 3.3 రెట్లు పెరిగాయి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. బి కేటగిరీలోనూ 85 శాతం సీట్లు స్థానికులకు వర్తింపజేశాం. తద్వారా 1,067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. 2014లో 613 పీజీ వైద్య సీట్లుంటే.. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంలోనే 1,249కు పెరిగాయి. దేశంలో ఇంత భారీగా పీజీ సీట్లు పెంచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణనే అగ్రగామి. 192 పీజీ సీట్లు ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా వచ్చాయి. ప్రభుత్వ - ప్రైవేటు రంగంలో కలిపి 2,449 పీజీ సీట్లున్నాయి. ఎనిమిదేళ్ల కిందట కేవలం 4 నర్సింగ్ కళాశాలలే ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.