* బడి మానేసిన విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు అధికారుల ఒత్తిడి
ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా బడి మానేసిన పిల్లల సంఖ్యను తగ్గించి చూపేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. బడి బయటి పిల్లల్ని చేర్పించాలని క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం లక్ష్యాలు విధించింది. దీంతో కొందరు అధికారులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారు. పాఠశాలలపై ఒత్తిడి తెచ్చి, మళ్లీ బడిలో చేరినట్లు రికార్డుల్లో రాసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పల్నాడుజిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల గతంలో మూతపడింది. అక్కడ చదివిన 15 మంది విద్యార్థులను డ్రాప్ బాక్సులో పెట్టారు. వారిని చేర్చుకున్నట్లు హాజరు పట్టికలో నమోదు చేయాలని సమీపంలోని మరో ప్రైవేటు పాఠశాలపై ఒత్తిడి తెచ్చారు. యాజమాన్యం రికార్డుల్లో వారి పేర్లను రాసుకొని, బడికి గైర్హాజరవుతున్నట్లు నమోదు చేస్తోంది. రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లో కలిపి ఈ ఏడాది 2.25 లక్షలమంది పిల్లలు మధ్యలో బడి మానేశారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేసి 52,000 మందిని వెనక్కి తీసుకొచ్చారు. ఇంకా 1.73 లక్షలమంది వివిధ కారణాలతో బడి బయటే ఉన్నారు. ఒకపక్క పాఠశాలలపై మరోపక్క వాలంటీర్లు, విద్య, సంక్షేమ సహాయకుల పైనా ఒత్తిడి పెరగడంతో పిల్లల గుర్తింపు పక్కదారి పడుతోంది.
ప్రభుత్వ బడుల్లో కొత్త చిక్కు..
ప్రభుత్వ బడుల్లో మానేసిన పిల్లల విషయంలో ప్రధానోపాధ్యాయులకు కొత్త చిక్కు వచ్చిపడింది. వారు మళ్లీ బడి చేరినట్లు రికార్డుల్లో రాయడం.. లేదంటే టీసీలు ఇచ్చినట్లు పేర్కొంటూ డ్రాప్ బాక్సుల నుంచి తొలగించాలి. టీసీలు ఇచ్చినట్లు రాస్తే మండల విద్యాధికారుల నుంచి ఒత్తిడి. దీంతో పిల్లలు వెనక్కి వచ్చినట్లు రాసుకొని, రికార్డులు కొనసాగిస్తున్నారు. బడి బయటి పిల్లల్ని గుర్తించే బాధ్యతను వాలంటీర్లు, విద్య, సంక్షేమ సహాయకులకు అప్పగించి, వారిపై తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో కొన్నిచోట్ల పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు నమోదు చేసేస్తున్నారు. మరి కొన్నిచోట్ల సార్వత్రి విద్యా పీఠంలో చదువుకునేందుకు రిజిస్టర్ అయ్యారని ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు. కడప జిల్లాలో ఓ విద్యార్థి బడి మానేశాడు. అనారోగ్యం కారణంగా మానేసినట్లు తండ్రి చెప్పగా.. సార్వత్రిక విద్యా పీఠంలో చేరినట్లు చెప్పాలని విద్యార్థి తండ్రికి సూచించి, ఇదే వివరాలను ఆన్లైన్ నమోదు చేశారు. కలెక్టర్లు రోజువారీ సమీక్షలతో ఒత్తిడి పెట్టడంతో ఏదో ఒక కారణం రాసేస్తున్నారు.
తప్పుపై తప్పు..
రాష్ట్రవ్యాప్తంగా 1-5 తరగతులు చదివేవారిలో 66,205 మంది బడి మానేయగా.. ఉన్నత పాఠశాలల్లో 1,07,211 మంది పాఠశాలకు దూరమయ్యారు. తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు పనులకు వెళ్లడంతో 16,857 మంది వారితో వెళ్లిపోయారు. సీజనల్ వలసల కారణంగా 38,951 మంది బడి మానేశారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 1,289 పిల్లలు చనిపోయారు.
హాజరు శాతం అందుకే తగ్గిందా?
బడి మానేసిన వారు తిరిగి బడిలో చేరినట్లు లెక్కలు చూపితే కొన్ని రోజులపాటు హాజరు నమోదు చేసినా ఆ తర్వాత హాజరు శాతం తగ్గిపోతుంది. పాఠశాల విద్యాశాఖ ఆగస్టులో వెబ్సైట్లో ఉంచిన సమాచారం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 15%-19%, ప్రైవేటులో 8%-10% మంది గైర్హాజరవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బడికి రావడం లేదంటే రికార్డుల్లోని అంకెల్లోనే తప్పులు ఉన్నట్లని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఏం చేయాలి?
పాఠశాలలకు వెళ్లే పిల్లలు మధ్యలో చదువు మానేస్తే ఏం చేయాలి? వారు వేరే పాఠశాలల్లో చేరారా? బడి మానేసి ఇంటి వద్ద ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారా? అనేది పరిశీలించాలి. వారిని మళ్లీ బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఏం చేస్తున్నారు?
అధికారులు మాత్రం బడి మానేసిన పిల్లలు మళ్లీ చేరినట్లు రికార్డుల్లో రాసుకోవాలంటూ పాఠశాలలపై ఒత్తిడి చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పిల్లవాడు బడి నుంచి వెళ్లిపోతే కారణం పేర్కొంటూ డ్రాప్ బాక్సులో పెడతారు. ఇప్పుడు అధికారులు ఆ డ్రాప్ బాక్సులను క్లియర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి తెలంగాణకు వలస వెళ్లారు. మరొకరు బడి మానేశారు. ఇప్పుడు ఈ పిల్లలు తిరిగి బడిలో చేరినట్లు రికార్డుల్లో రాసుకోవాలని మండల విద్యాధికారి ఆదేశించారు. దీంతో హాజరు పట్టికలో వీరి పేర్లు ఎక్కించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే దుస్థితి నెలకొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.