ఈనాడు, హైదరాబాద్: విద్యాపరంగా వెనకబడి ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో చదువు మధ్యలో వెళ్లిపోయేలా ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలని ఐఐటీలు భావిస్తున్నాయి. మొదటి ఏడాది తర్వాత బీటెక్ చదువు తమవల్ల కాదనుకునే విద్యార్థులు డిప్లొమాను ఎంచుకొని.. రెండేళ్లు పూర్తయ్యాక డిప్లొమా సర్టిఫికెట్తో వెళ్లిపోయే అవకాశం ఇవ్వాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. 2019 సెప్టెంబరులో జరిగిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో విద్యాపరంగా వెనకబడిన వారికి మూడేళ్ల తర్వాత బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ ఇవ్వాలని ఐఐటీలు ప్రతిపాదించాయి. అందుకు విద్యాశాఖ మంత్రి ఛైర్మన్గా ఉన్న కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపి మార్గదర్శకాలు తయారు చేసుకోవాలని సూచించింది. కరోనా కారణంగా ఆ ప్రతిపాదన అమలు కాలేదు. ఇటీవల కాలంలో పలు ఐఐటీల్లో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే గతంలో మాదిరిగా మూడేళ్లతో పాటు రెండేళ్లకు డిప్లొమా సర్టిఫికెట్ విధానం కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే కౌన్సిల్ సమావేశంలో డిప్లొమా పట్టాపై చర్చించే అవకాశం ఉందని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి.
న్యాక్ బలోపేతానికి కమిటీ
ఉన్నత విద్యాసంస్థలకు ఇచ్చే అక్రిడిటేషన్ విధానాన్ని బలోపేతం చేయాలని గతంలోనే నిర్ణయించిన కేంద్ర విద్యాశాఖ తాజాగా ఐఐటీ కాన్పుర్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.