ఓయూ పరీక్షల విభాగం ఆటోమేషన్
రికార్డుల డిజిటలైజేషన్కు శ్రీకారం
ఈనాడు, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో మరో కీలక ముందడుగు. పరీక్షల విభాగం ఆటోమేషన్ చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. దశాబ్దాలుగా ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఔరంగాబాద్కు చెందిన ఓ వ్యక్తి ధ్రువపత్రాన్ని పరిశీలించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. 1930కి చెందిన రికార్డు కావడంతో సేకరించడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు అప్పటి ధ్రువపత్రాలన్నీ ఉర్దూలో ఉన్నాయి. ఎట్టకేలకు వెతికి పట్టుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయ రికార్డులన్నీ పరీక్షల విభాగంలో జాగ్రత్తగా పొందుపరిచారు. లక్షల సంఖ్యలో ఉన్న రికార్డుల్లో.. అవసరమైన పత్రాలను భౌతికంగా వెతికి తీసుకోవడం కష్టమవుతోంది. ఇప్పటివరకు ఓయూ పరీక్షల విభాగంలో 2009 తర్వాత రికార్డులు, ధ్రువపత్రాలే డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మిగతావీ కంప్యూటరీకరించేందుకు శ్రీకారం చుట్టారు.
మూల్యాంకనమూ..
ఇప్పటికే డిగ్రీ, పీజీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్లైన్లో చేస్తున్నారు. ఏటా వర్సిటీ పరిధిలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఆన్స్క్రీన్ మూల్యాంకనంలో భాగంగా జవాబు పత్రాలన్నీ స్కాన్ చేసి కంప్యూటరీకరిస్తున్నారు. ఆన్లైన్లో సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులకు పంపించి దిద్దిస్తున్నారు. ఏ జవాబుపత్రం ఎవరు దిద్దుతున్నారో బయటకు తెలియదు.
మొబైల్ యాప్..
ధ్రువపత్రాలు పొందేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను ఓయూ తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని విభాగాలకే పరిమితమైంది.త్వరలో పూర్తిస్థాయిలో సేవలందించేలా తీర్చిదిద్దుతున్నారు.
ధ్రువపత్రాల జారీ నుంచి, పాత రికార్డులన్నీ జూన్కల్లా డిజిటలైజ్ కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.బి.నగేశ్ తెలిపారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలన్నది లక్ష్యం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.