అమలుకు అధికారుల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: బాసర సరస్వతీదేవి ఆలయంలో చిన్నారులకు చేయించే అక్షరాభ్యాసాలను ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలని దేవాదాయశాఖ యోచిస్తోంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొస్తుంటారు. ఏటా నాలుగు లక్షల మంది వరకు భక్తులు బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటుండగా.. 40 వేల మందికిపైగా అక్షరాభ్యాస పూజలు చేయించుకుంటున్నారు. ముఖ్యమైన రోజుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఆ సదుపాయాన్ని ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తే మరింత మందికి అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో పూజలకు ఆన్లైన్ విధానాన్ని ఇటీవల ప్రవేశపెట్టగా.. విశేష స్పందన లభించింది. దీంతో రెండోదశలో బాసర అమ్మవారి ఆలయాన్ని ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టారు. ఆన్లైన్లో అక్షరాభ్యాస పూజ చేయించుకున్న వారికి అమ్మవారి అక్షింతలు, పలక, బలపం, ప్రసాదాన్ని పోస్టులో పంపాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. విధివిధానాలపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.