* ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన 2 నెలల తర్వాత షురూ
ఈనాడు, హైదరాబాద్: రెండేళ్ల డీఈడీ సీట్ల భర్తీకి డిసెంబరు 1 నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు నెలాఖరులోనే పూర్తిచేశారు. డీఈడీ కళాశాలలను తనిఖీ చేసి.. అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం వహించింది. అప్పటి నుంచి వేలమంది విద్యార్థులు వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ ప్రక్రియ ప్రారంభమవడంతో డీఈఈసెట్ కన్వీనర్, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం సంచాలకుడు శ్రీనివాసాచారి నవంబర్ 26న కౌన్సెలింగ్ కాలపట్టికను విడుదల చేశారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని వారికి నవంబర్ 29న మరోసారి అవకాశం కల్పిస్తున్నారు.
గత ఏడాది 99... ఈసారి 59 ప్రైవేట్ కళాశాలలే
గత విద్యా సంవత్సరం రాష్ట్రంలో 10 ప్రభుత్వ, మరో 99 ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. ఈసారి ప్రైవేట్ కళాశాలలు ఏకంగా 40 తగ్గిపోయాయి. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్న విమర్శలు ఉన్నాయి. దానివల్ల విద్యార్థులు అసలు కౌన్సెలింగ్ జరుగుతుందో లేదోననే సందేహంతో ఇతర కోర్సుల్లో చేరారు. దీన్ని గమనించిన 40 ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమకు ఈ సంవత్సరానికి ప్రవేశాలు వద్దని ఆప్షన్ ఇచ్చాయి. ఈ క్రమంలో 59 ప్రైవేట్ కళాశాలలే కౌన్సెలింగ్లో పాల్గొంటాయి.
ఇదీ కాలపట్టిక
* డిసెంబరు 1-4 వరకు: వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం
* 10వ తేదీ: సీట్ల కేటాయింపు
* 11-14వ తేదీ వరకు: ఫీజు చెల్లింపు
* 15వ తేదీలోపు: కళాశాలల్లో రిపోర్ట్ చేయటం
* 17వ తేదీ : తరగతుల ప్రారంభం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.