* క్రమబద్ధీకరించిన జేపీఎస్ల నియామకాలకు ప్రభుత్వం అనుమతి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో 6603 నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం(సెప్టెంబర్ 16) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించేందుకు ఆదేశించింది. ఇవిగాక మరో 3065 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మున్ముందు క్రమబద్ధీకరించే కార్యదర్శులను వాటిల్లో నియమించేందుకు వెసులుబాటు కల్పించింది. జేపీఎస్లకు నెలకు రూ.28,719 వేతనం వస్తుండగా.. నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు వేతన స్కేల్ను రూ.24280-72850 వర్తింపజేయనుంది. రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్లు పనిచేస్తుండగా.. వారిని క్రమబద్ధీకరించి నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నాలుగేళ్ల నిరాటంక సర్వీసు, పనితీరు ప్రాతిపదికగా అర్హులను గుర్తించాలని గతంలో కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లాల్లో వారి పనితీరును మదింపు చేసి 6616 మందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించి వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈక్రమంలో పంచాయతీరాజ్ శాఖ వినతి మేరకు కొత్తగా 6603 నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. మంజూరు పోస్టుల కంటే 13 మంది అర్హులు ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే శాఖాపరంగా ఉన్న 3065 పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆదేశించింది.
మిగిలిన వారికి సైతం..
వాస్తవానికి రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్లు పనిచేస్తున్నారు. ఇందులో 1000 మంది పొరుగు సేవలవారు కాగా.. మరో 1739 మంది డీఎస్సీ ద్వారా ఎంపికైన వారు. ఎంపికైన వెంటనే విధుల్లో చేరకుండా... వివిధ కారణాల వల్ల జాప్యం చేయడంతో వారి సర్వీసు నాలుగేళ్లు నిండలేదు. దీంతో మదింపు జాబితాలో వారి పేర్లు లేవు. ప్రభుత్వం 6603 పోస్టులను క్రమబద్ధీకరించిన జేపీఎస్లతో భర్తీ చేసింది. మరో 3065 ఖాళీ పోస్టులున్నందున జేపీఎస్లుగా పనిచేసిన మిగిలిన వారికి క్రమబద్ధీకరణ ద్వారా నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందే వీలుంది. మరోవైపు నాలుగో గ్రేడ్ కార్యదర్శులుగా ఏతేదీ నుంచి నియమితులయ్యారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొత్త స్కేలులో వేతనాల పంపిణీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.