‣ హాజరుకానున్న 1.12 లక్షల మంది విద్యార్థులు
విజయవాడ సబ్కలెక్టరేట్, న్యూస్టుడే : జిల్లా అధికారులు ఒక వైపు కొవిడ్తో పోరు సల్పుతూనే.. మరోవైపు మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు. నగరంలోని విడిది కార్యాలయంలో కలెక్టరు ఇంతియాజ్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,12,154 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. నగర పరిధిలో 77, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు 54,171 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 57,983 మంది ఉన్నట్టు వివరించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. నాలుగు ఫ్లయింగ్, మరో 8 సిట్టింగు స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
కేంద్రాల వద్ద ఐసోలేషన్ గదులు
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కొవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించామని, ఐసోలేషను గదిని ఏర్పాటు చేసినట్టు కలెక్టరు వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మెడికల్ కిట్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, ఫేస్ మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షల తేదీల్లో రూట్ల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి బస్సులు నడిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పేర్కొన్నారు. సమీక్షలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్ఐవో పి.రవికుమార్, వీఎంసీ అదనపు కమిషనరు మోహనరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె.యోహాను, షేక్ అహ్మద్, బి.వి.శ్రీనివాస్, హైపవర్ కమిటీ సభ్యుడు ఆనందకుమార్, ఉప విద్యాశాఖాధికారిణి చంద్రకళ, వైద్యాధికారి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.
e-Books: ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు సబ్జెక్టు నిపుణుల సమాధానాలతో...
29, 30 తేదీల్లో వెబ్సైట్లో ఇంటర్ హాల్టికెట్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.