‣ అధికారులకు ఏపీ విద్యాశాఖ మంత్రి సూచన
‣ మే 5 నుంచి నిర్వహణ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మే అయిదో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. కొవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాలని, ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యమని గుర్తించాలని తెలిపారు. ఇంటర్ పరీక్షలపై ఏప్రిల్ 28న మంత్రి వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దుకాలేదని, కొన్నిచోట్ల నిర్వహిస్తున్నారని, మరికొన్నిచోట్ల వాయిదా వేశారని వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులను ఆయన అభినందించారు. వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థంగా అమలుచేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని వెల్లడించారు.
‣ 1,452 పరీక్షా కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1,452 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, గతేడాది కంటే 41 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేశామని మంత్రి సురేష్ వెల్లడించారు. మొదటి ఏడాది 5,12,959, రెండో ఏడాది 5,19,510 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కొవిడ్-19 ప్రోటోకాల్ అధికారి ఉంటారని, కరోనా లక్షణాలున్న పిల్లల కోసం ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రత్యేకగది ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏప్రిల్ 29న సాయంత్రంలోపు హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, వాటివెనుక కొవిడ్-19 నిబంధనలు ముద్రించి ఉంటాయని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.