ఈనాడు, దిల్లీ: ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన జేఈఈ- మెయిన్ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత కారణంగా.. విద్యార్థులు, పరీక్ష నిర్వాహకుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఏప్రిల్ 18న ప్రకటించారు. తదుపరి పరీక్ష ఎప్పుడు నిర్వహించేదీ 15 రోజుల ముందు వెల్లడిస్తామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఏడాది నాలుగు విడతల్లో జేఈఈ- మెయిన్ నిర్వహించడానికి ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ’ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్టీఏ) షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో రెండు విడతలు ఫిబ్రవరి 23-26, మార్చి 16-18 తేదీల్లో పూర్తయ్యాయి. మూడో విడత నిర్వహించాల్సి ఉంది. ఇవి వాయిదా పడినందున సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మరింత బాగా సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి సూచించారు. ‘ఎన్టీఏ అభ్యాస్’ యాప్ ద్వారా అధ్యాయాల వారీగా ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలని పిలుపునిచ్చారు. తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఎన్టీఏ జేఈఈ మెయిన్ పోర్టల్ను చూడాలన్నారు. జేఈఈ- మెయిన్ వాయిదా పడటంతో జులై 3న జరగాల్సిన అడ్వాన్డ్స్ పరీక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.