• facebook
  • whatsapp
  • telegram

టెన్త్‌కు ప్రత్యక్ష త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే మేలు!

వార్షిక ప‌రీక్ష‌ల‌పై తల్లిదండ్రుల ఆందోళ‌న‌

ఏప్రిల్‌ 7 నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు లేనట్లే?

‣ 27 నుంచి జేఈఈ మెయిన్‌ యథాతథం

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా? తెలంగాణ‌లో విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24 నుంచి మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఇది. ఇంటర్‌ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు, పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26 వరకు జరుగుతాయని ప్రభుత్వం నెల క్రితమే ప్రకటించింది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను 30 శాతం వరకు తగ్గించడంతోపాటు ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. సిలబస్‌ పూర్తవుతుందా? అనే సందేహం వ్యక్తమవుతున్నా.. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను మూసివేస్తుండటంతో వార్షిక పరీక్షలు జరుగుతాయా.. లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఆ పరీక్షలు లేనట్లే?

ఇంటర్‌బోర్డు గతంలో ప్రకటించిన ప్రకారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ 1న నైతికత, మానవీయ విలువలు, 3న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించాలి. కళాశాలల మూసివేత కారణంగా ఆ రెండు పరీక్షలు ఆ తేదీల్లో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఎంపీసీ, బైపీసీ, జియాలజీ ద్వితీయ సంవత్సరం, ఒకేషనల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరుపుతామని ఇంటర్‌బోర్డు గతంలో ప్రకటించింది. ఇప్పుడు అవి జరుగుతాయా.. లేదా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్‌ 7 నుంచి మాత్రం ప్రయోగ పరీక్షలు జరిగే పరిస్థితి లేదని అన్నారు.

ఆ పరీక్షలు జరపకుంటే సమస్యా?

తాజా పరిస్థితుల్లో ప్రయోగ పరీక్షలు రద్దు చేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటం సమస్యగా మారుతోంది. దీనిపై కొందరు నిపుణులు ఆ మార్కులను మినహాయించి వార్షిక పరీక్షలు జరిపితే వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

ఎఫ్‌ఏ - 1 మాత్రమే పూర్తి

పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 మాత్రమే ఇప్పటివరకు పూర్తయింది. ఎఫ్‌ఏ-2 ఏప్రిల్‌ మొదటివారంలో జరగాలి. ఈ అంతర్గత పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులుంటాయి. సగటు మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గత ఏడాది వార్షిక పరీక్షలు జరగకపోవడంతో అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా 100కి మార్కులు లెక్కించి విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. ఈసారి ఒక్కటే పూర్తయింది.  ఒకవేళ ఎఫ్‌ఏ-2 జరగకుంటే ఎఫ్‌ఏ-1 ఆధారంగా ఉత్తీర్ణులను చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 40 రోజుల ప్రత్యక్ష తరగతుల బోధనతో వార్షిక పరీక్షలు నిర్వహించడం కూడా సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ పరీక్షలు యథాతథం

మూడో విడత జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 27 నుంచి జరగాల్సి ఉంది. విద్యాసంస్థలను మూసివేసినా జేఈఈ ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గత ఏడాది కూడా జాతీయస్థాయి పరీక్షలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పరీక్షలను వాయిదా వేయాలనుకుంటే కేంద్రం ప్రకటించాల్సి ఉంటుంది.

ఉస్మానియా, జేఎన్‌టీయూ పరీక్షలూ..

జేఎన్‌టీయూలో జరుగుతున్న యూజీ, పీజీ రెగ్యులర్‌/సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ప్రకటించారు. ఎవరికైనా కొవిడ్‌ సోకితే వారికి ప్రత్యేకంగా మరో పరీక్ష నిర్వహిస్తామని, రెగ్యులర్‌గానే పరిగణిస్తామని పేర్కొన్నారు.

* ఉస్మానియాలో ప్రస్తుతం పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. అవన్నీ యథాతథంగా ఉంటాయని పరీక్షల నియంత్రణాధికారి శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు. యూజీ పరీక్షలు ఏప్రిల్‌ 30 వరకు, ఇంజినీరింగ్‌ ఏప్రిల్‌ 16, పీజీ మార్చి 30 వరకు షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.