* పీజీ వైద్య సీట్లపై కోర్టుకు నివేదించిన ఇరుపక్షాల న్యాయవాదులు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయించిన రుసుములతో పీజీ వైద్య, దంతవైద్య సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఓ అంగీకారానికి వచ్చినట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. మూడేళ్లకు మరో రూ.45 వేలు అదనంగా వసూలు చేస్తామని, అందుకు విద్యార్థులు సైతం అంగీకరించారని యాజమాన్యాల తరఫు న్యాయవాదులు తెలిపారు. రూ.45 వేల వసూలు.. నిబంధనల్లో ఎక్కడా లేదని విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి అభ్యంతరం లేవనెత్తారు. అదనంగా చెల్లించే సొమ్ము కూడా కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరువైపు న్యాయవాదులు చెప్పిన వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.సురేశ్రెడ్డితో కూడిన ధర్మాసనం జులై 9న ఈ మేరకు స్పష్టం చేసింది. పీజీ వైద్య, దంతవైద్య విద్య సీట్లలో చేరే నిమిత్తం ప్రవేశ రుసుము చెల్లిస్తామంటే ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు అనుమతించడం లేదంటూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వైద్య కళాశాలల్లో రుసుముల్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం మే 29న ఇచ్చిన జీవో 56ని సవాలు చేస్తూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలూ కోర్టులో పిటిషన్లు వేశాయి ఫీజులను తగ్గించడం సరికాదన్నాయి. జీవో 56 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను అమలు చేయాలని పాత్రికేయుడు తోట సురేశ్బాబు ఓ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.