• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1పై హైకోర్టు విచారణ

* కొన్ని వ్యాజ్యాల్లో తీర్పు వాయిదా
* 20న‌ వాదనల కొనసాగింపు

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో అక్టోబ‌రు 19న‌ హైకోర్టు విచారణ చేసింది. కొన్ని వ్యాజ్యాల్లో వాదనలు ముగియగా, తీర్పు వాయిదా పడింది. మరికొన్నింటిపై అక్టోబ‌రు 20న‌ విచారణ కొనసాగనుందని న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. దసరా సెలవుల ప్రారంభానికి ముందే నిర్ణయం వెల్లడిస్తామన్నారు. 2018 డిసెంబర్లో 169 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ప్రాథమిక పరీక్షను 2019 మే 26న నిర్వహించి, ఫలితాలు వెల్లడించింది. నవంబరు 2 నుంచి ప్రధాన పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే... ప్రాథమిక పరీక్షలోని మొత్తం 120 ప్రశ్నలలో ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేసినప్పుడు 51 తప్పులు దొర్లాయని, ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై అక్టోబ‌రు 19న‌  హైకోర్టు తుది విచారణ చేసింది. కొందరు అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదిస్తూ... ‘పరీక్ష సమయంలో నాన్‌ ప్రోగ్రామబుల్‌ క్యాలిక్యులేటర్లను అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువదించినప్పుడు భారీగా తప్పులు దొర్లాయి. జవాబు ‘కీ’లోనూ తప్పులున్నాయి. ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలి’ అని కోరారు. మరికొందరి తరఫున న్యాయవాదులు రచనారెడ్డి, తాండవ యోగేష్‌ వాదిస్తూ... ఈ వ్యవహారం తేలేంత వరకు నవంబరు 2న ప్రారంభమయ్యే ప్రధాన పరీక్షను నిలువరించాలని కోరారు. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ... ‘క్యాలిక్యులేటర్ల అనుమతి తప్పని సరికాదు. ప్రశ్నల సరళి ఆధారంగానే వాటిని అనుమతిస్తారు. 25 ప్రశ్నల ‘కీ’ తప్పుగా ఉన్నందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. తెలుగు ప్రశ్నల్లో తప్పులు దొర్లితే ఆంగ్ల ప్రశ్నలను ఆధారం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నాం’ అని వివరించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.