• facebook
  • whatsapp
  • telegram

ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా విడుదల

బాసర,న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) 2020-21 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాల జాబితాను అక్టోబ‌రు 20న‌  విడుదల చేసింది. ఏవో రాజేశ్వర్‌రావు ఈ జాబితాను విడుదల చేశారు. పదోతరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ కోర్సులో ప్రవేశానికి సెప్టెంబ‌రులో 40,158 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,492 సీట్లకుగాను 1,193 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల్లో గ్రేడ్లు ప్రకటించకపోవటంతో తెలంగాణ -ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడిగా కేటాయించిన 15 శాతం సీట్లకు జాబితా విడుదల చేయలేదు. ప్రవేశాల జాబితాలో 47 శాతం మంది బాలురు, 53 శాతం మంది బాలికలు సీట్లు సాధించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాలయ వెబ్‌సైట్‌  ‌www.rgukt.ac.in లో పొందుపరిచారు. విద్యాలయం ఎంపిక చేసిన ప్రవేశాల జాబితాలో అత్యధికంగా జగిత్యాల జిల్లాకు చెందిన 86 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అత్యల్పంగా నారాయణ పేట జిల్లా 4 సీట్లను మాత్రమే దక్కించుకుంది. ఎంపికైన విద్యార్థులకు నవంబరు 3 నుంచి 7వ తేది వరకు నాలుగురోజుల పాటు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.
 

భారీగా నష్టపోయిన ఓసీ విద్యార్థులు
అక్టోబ‌రు 20న‌  విడుదలైన జాబితాలో ఓసీ విద్యార్థులు భారీగా నష్టపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.  పది జీపీఏ సాధించిన వారు వేలల్లో ఉండటంతో సీటు దక్కించుకోవడంలో వయసు కీలకంగా మారింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2000 సంవత్సరాన్ని, మిగిలినవారికి 2003 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించి ఎక్కువ వయస్సు ఉన్నవారికి విద్యాలయం సీట్లు కేటాయించింది. దీంతో ఇద్దరు విద్యార్థుల జీపీఏ సమానం అయినప్పుడు బీసీ, ఓసీ విద్యార్థుల నష్టపోయారని పేర్కొంటున్నారు. ఓపెన్‌ కేటగిరీలోని 597 సీట్లకుగాను 20 సీట్లు మాత్రమే ఓసీ విద్యార్థులకు లభించాయి.

శాతవాహన, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ పరీక్షలు వాయిదా
శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో అక్టోబరు 21, 22వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ (బ్యాక్‌లాగ్‌) 2, 4వ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి పరీక్షలు నిర్వహించే తేదీలను తదుపరి వెల్లడిస్తామని పేర్కొన్నారు. 
* డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అక్టోబరు 21 నుంచి 23 వరకు జరగనున్న డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలను వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.