* సిలబస్ పూర్తి చేయడం కష్టసాధ్యమంటున్న ఉపాధ్యాయులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 1-10 తరగతుల పాఠ్యప్రణాళిక(సిలబస్)ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. అందులోని అధ్యాయాలను తరగతి గదిలో బోధించాల్సినవి, ప్రాజెక్టు ఆధారితమైనవి అంటూ రెండుగా విభజించింది. ప్రాజెక్టు ఆధారిత అధ్యాయాలకు సంబంధించిన సిలబస్.. ఫార్మేటివ్ అసెస్మెంట్లు(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)/బోర్డు పరీక్షలకు ఉండదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై డీఈవోలు, ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. సిలబస్ తగ్గిస్తున్నట్లు ఆదేశాల్లో ఎక్కడా పేర్కొనలేదు. తరగతి గది బోధనకు సంబంధించి కొన్ని సబ్జెక్టుల్లో పాఠాలు పూర్తిగా తొలగించగా.. మరికొన్నింటిలో కొన్ని భావనలు(కాన్సెప్ట్లు) మాత్రమే తీసివేశారు. ఉదాహరణకు 5వ తరగతి వరకు గణితంలో కొన్ని యూనిట్లు తొలగించగా, 6-10 తరగతులకు భావనలు పక్కనపెట్టారని ఓ ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70 శాతం సిలబస్ను పూర్తిచేయడమే కష్టసాధ్యమని, 30 శాతం సిలబస్లో ప్రాజెక్టులు చేయించడం కాగితాలకే పరిమితం అవుతుందని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
పదో తరగతిలో ఇలా...
గణితంలో 30 శాతం, భౌతికశాస్త్రంలో 27 శాతం, జీవశాస్త్రంలో 30 శాతం, సాంఘికశాస్త్రంలో 29 శాతం, ఆంగ్లంలో 25 శాతం ప్రాజెక్టు ఆధారిత సిలబస్లో చేర్చారు. అంటే వాటినుంచి పరీక్షల్లో ప్రశ్నలు రావు. ఏయే తరగతుల్లో ఏ అధ్యాయాలను ప్రాజెక్టుల కోసం కేటాయించారో పూర్తి వివరాలను www.scert.telangana.gov.in అనే వెబ్సైట్లో ఉంచారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.