న్యూస్టుడే-కరీంనగర్ విద్యావిభాగం: పాఠశాల స్థాయిలో ప్రతిభ చూపే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పేరిట పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తోంది. దీని గురించి ప్రచారం, అవగాహన లేని కారణంగా జిల్లాలో చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలను అందుకోవాలనే ఆసక్తి గల జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 20వ తేదీతో గడువు ముగిసినా విద్యార్థుల ప్రయోజనం కోసం దరఖాస్తు గడువును డిసెంబరు 11వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్యపరిచి దరఖాస్తు చేయిస్తే వారి చదువులకు ఆలంబనగా నిలిచినవారవుతారు. జిల్లాలో అర్హత సాధించిన 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 248 మంది ఉన్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు వసతి సదుపాయాలు లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50లక్షల లోపు ఉండాలి. ప్రతిభా పరీక్ష ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి ఏటా రూ.12వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. విద్యార్థులు సమీపంలోని మీసేవ లేదా అంతర్జాలం ద్వారా http///bse.telangana.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా వచ్చే నెల 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం చెల్లించాలి. పరీక్ష రుసుం జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.50 చెల్లించాలి. ఆన్లైన్లో విద్యార్థులు నమోదు చేసిన దరఖాస్తు ఫారాలు, నామినల్ రోల్స్, ఆన్లైన్ పరీక్ష రుసుం వివరాల కాపీలను ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించి డిసెంబరు 15వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని డీఈవో జనార్దన్రావు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.