* 14న 6, 7 తరగతుల పునఃప్రారంభం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డిసెంబరు 14 నుంచి పునఃప్రారంభం కానున్న 6, 7 తరగతుల విద్యార్థులను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల్లో మూడో వంతు మందితో వారానికోసారి సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే 8, 9, 10 తరగతులకు బడులను నిర్వహిస్తుండగా.. 14 నుంచి 6, 7 తరగతులను పునఃప్రారంభించనున్నారు. ఇందు కోసం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వర్క్బుక్స్, ఆన్లైన్తరగతుల పర్యవేక్షణ, సందేహాల నివృత్తికి విద్యార్థులు బడులకు వచ్చేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కొవిడ్నిబంధనలను పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నారు.
ప్రవేశాలు నిర్వహించాలి..
* ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులందరూ రోజూ పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది.
* ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు బడులు కొనసాగుతాయి.
* అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించి, ప్రాథమిక స్థాయిలో ప్రవేశాలకు వయసు కలిగిన పిల్లలందర్నీ ఉపాధ్యాయులు బడుల్లో చేర్పించాలి.
* విద్యార్థులు పూర్తి చేసిన వర్క్షీట్లను వెబ్సైట్లో అప్లోడ్చేయడంతోపాటు ఆన్లైన్శిక్షణకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి.
* ‘పఠనాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా గ్రంథాలయ పుస్తకాలను పిల్లలకు అందించనున్నారు. గ్రంథాలయాల వద్ద నిర్వహించే ‘ఆదివారం కథ’ సమయానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా హాజరుకావొచ్చు.
* జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం బియ్యం, ఇతర సామగ్రి పంపిణీ సమాచారాన్ని మొబైల్యాప్లో ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.