* మొదటి దశ ప్రాంగణ ఎంపికల్లోనే 222 మందికి ఉద్యోగాలు
ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. డిసెంబరు 1వ తేదీ నుంచి 6 వరకు మొదటి దశ ప్రాంగణ ఎంపికలు పూర్తయ్యాయి. ఇందులో జపాన్, తైవాన్ దేశాలకు చెందిన సంస్థలు ఇక్కడి విద్యార్థులకు ఆఫర్లు అందించాయి. ఆయా దేశాలకు చెందిన సంస్థల నుంచి ఈ సారి 222 మంది విద్యార్థులకు ఉద్యోగాల కోసం పిలుపు అందింది. గతేడాది రెండు దశల ప్రాంగణ ఎంపికల్లో కలిపి 295 మంది ఉద్యోగాలు దక్కించుకోగా.. ఈ సారి కేవలం మొదటి దశలోనే 222 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. వచ్చే జనవరిలో రెండో దశ ప్రాంగణ ఎంపికలు చేపట్టనున్నారు. అది పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఐఐటీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి దశలో 150 సంస్థలు ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యాయి. కానీ ఈసారి వాటి సంఖ్య 116 మాత్రమే. సంస్థలు తగ్గినా గతేడాదితో పోల్చితే ఈసారి ఉద్యోగావకాశాలు మెరుగవడం గమనార్హం. గతేడాది 37 మందికి ప్రి ప్లేస్మెంట్ అవకాశాలు రాగా.. ఈసారి ఆ సంఖ్య 48కి చేరింది. మైక్రోసాఫ్ట్, గోల్డ్మన్ శాక్స్, జాగ్వార్ లాండ్ రోవర్, ఆల్ఫోన్సో, భారతీ ఎయిర్టెల్ తదితర సంస్థలు ఉద్యోగుల ఎంపిక కోసం ముందుకొచ్చాయి. కరోనా కారణంగా ఈసారి ప్రాంగణ ఎంపికలను ఆన్లైన్లో నిర్వహించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.