* 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఈనాడు, హైదరాబాద్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏఐటీ)తో కలిసి నిర్వహిస్తున్న అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీటెక్+ఎంఈ)ను జేఎన్టీయూహెచ్ పునఃప్రారంభించింది. డిమాండ్ లేదంటూ గత విద్యా సంవత్సరమే ఈ కోర్సుకు వర్సిటీ స్వస్తి పలికింది. మళ్లీ ఏడాదిలోనే ఒప్పందాన్ని(ఎంఓయూ) పునరుద్ధరించుకొని తాజాగా ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని వెనుక కొందరి ఒత్తిడి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు జేఎన్టీయూహెచ్లో మూడున్నర సంవత్సరాలు, బ్యాంకాక్లోని ఏఐటీలో ఏడాదిన్నర చదువుతారు. రెండు వర్సిటీల నుంచి డిగ్రీ పట్టాలు అందుతాయి. 2009లో ఈ కోర్సును ప్రారంభించారు. మొదటి రెండు మూడేళ్లు సీట్లు భర్తీ అయినా ఆ తర్వాత సగం సీట్లు కూడా నిండటం లేదు. దీంతో గత ఏడాది నిలిపివేశారు. తాజాగా కోర్సు పునరుద్ధరణపై వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ను వివరణ కోరగా.. ‘‘ఎంఓయూను రెన్యువల్ చేయడంపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఆ వర్సిటీలో డైరెక్టర్ మారడం, మన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో మళ్లీ కొనసాగిస్తున్నాం. స్వీడన్లోని బ్లెకింగ్ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్నీ పొడిగించాం. ఈ కోర్సులకు రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది’’ అని వివరించారు. ఏఐటీ విశ్వవిద్యాలయానికి మంచి పేరుందని, అయితే కోర్సులో చేరి ఉద్యోగావకాశాలు రాకుంటే విద్యార్థులకు నష్టం తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
23న కౌన్సెలింగ్
ఏఐటీ, బ్లెకింగ్ వర్సిటీలతో కలిసి అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశానికి డిసెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో డిసెంబరు 22 వరకు గడువు ఉంది. ఈ మేరకు వర్సిటీ నోటిఫికేషన్ జారీచేసింది. డిసెంబరు 23న కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.