• facebook
  • whatsapp
  • telegram

బోధన ఫీజులకు సగం దరఖాస్తులూ అందలే!

* డిసెంబ‌రు నెలాఖరుతో ముగియనున్న గడువు


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు దరఖాస్తులు సగం అందలేదు. మరోపక్క ఈ డిసెంబ‌రు నెలాఖరుతో గడువు ముగియనుంది. 2020-21 ఏడాదికి దాదాపు 13.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమశాఖలు అంచనా వేస్తుంటే ఇప్పటి వరకు కేవలం 3.5 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం.
దరఖాస్తు చేయాలంటే..
* గతంలో కళాశాలల్లో చేరి ప్రసుత్తం రెండు, మూడు, నాలుగు సంవత్సరాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు 8 లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఈ పునరుద్ధరణ విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు రెవెన్యూ కార్యాలయాల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు.
* బ్యాంకు పాసుపుస్తకం, మార్కుల మెమో, ఆదాయ ధ్రువీకరణ హామీపత్రంతో దరఖాస్తు చేసేందుకు అవకాశముంది. కొన్ని కోర్సుల ఫలితాలు వెల్లడైనప్పటికీ ఇంకా మెమోలు రాలేదు.
వివరాలు వచ్చాక అనుమతి
కరోనాతో 2020-21 ఏడాదికి ప్రవేశాలు పూర్తికాకపోవడంతో కొత్త విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ-పాస్‌ వెబ్‌సైట్లో అందుబాటులోకి రాలేదు. వివిధ కోర్సుల ప్రవేశాల కన్వీనర్ల నుంచి డేటా రాకపోవడంతో ఈ ప్రక్రియ మొదలుపెట్టలేదని సంక్షేమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రవేశప్రక్రియ పూర్తయి వివరాలు అందుబాటులోకి వస్తేనే దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించాయి.
నమోదులో 42 కళాశాలలే!
బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు విద్యార్థులు దరఖాస్తు చేయాలంటే ఆయా కళాశాలలకు సంబంధిత బోర్డులు, యూనివర్సిటీల నుంచి ఏటా అనుబంధ గుర్తింపు ఉండాలి. ఇప్పటి వరకు ఈ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా బోధన ఫీజులకు 5,380 కళాశాలలు అర్హత కలిగితే ఇప్పటి వరకు ఈపాస్‌లో కేవలం 42 కళాశాలలు మాత్రమే నమోదయ్యాయి. ఇలాంటి కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించేందుకు వీలుంటుందని సంక్షేమ వర్గాలు వెల్లడించాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.