• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్‌?

తొలుత ఫిబ్రవరి 22 నుంచి అంటూ వెబ్‌సైట్‌లో సమాచారం
అనంతరం తొలగింపు


ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా  ఇంటర్మీడియేట్‌/12వ తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి నాలుగో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్ష నోటిఫికేషన్‌కు సంబంధించి డిసెంబ‌రు 15న‌ సాయంత్రం సమాచార కరపత్రాన్ని జేఈఈ మెయిన్‌-2021 వెబ్‌సైట్లో ఉంచిన జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ).. రాత్రి దాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయని, వచ్చే జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తొలుత బ్రోచర్‌లో ఎన్‌టీఏ పేర్కొంది. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో వెబ్‌సైట్‌ నుంచి సమాచార పత్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్లో మార్పులు చేసి త్వరలోనే నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చని నిపుణులు భావిస్తున్నారు.   ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడించినట్లుగానే ఫిబ్రవరిలో మొదలై.. మే వరకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాలుగుసార్లూ రాసుకోవచ్చు. లేదా ఒక్కసారే హాజరు కావొచ్చు. వారు రాసిన పరీక్షల్లో అత్యధిక మార్కులను పరిగణనలోకి తీసుకొని నాలుగు విడతల పరీక్షల తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈసారి నుంచి ఆంగ్లంతోపాటు తెలుగు, ఉర్దూ సహా అన్ని  ప్రాంతీయభాషల్లో ప్రశ్నపత్రాన్ని అందజేస్తారు.

ప్రశ్నపత్రం తీరు..
గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాలకు సంబంధించి ఒక్కో సబ్జెక్టులో 25 ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయన్న సంగతి తెలిసిందే. ఈసారి  ఛాయిస్‌ ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒక్కో సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఇస్తారు. ‘ఏ’ సెక్షన్‌లో 20 ప్రశ్నలుంటాయి. అందులో  ఛాయిస్‌ ఉండదు. తప్పు జవాబులకు రుణాత్మక మార్కులు(-1) ఉంటాయి. సెక్షన్‌-బీలో న్యూమరికల్‌(పూర్ణాంకాలు) ప్రశ్నలు 10 ఇస్తారు. అందులో అయిదింటికి మాత్రమే జవాబులు గుర్తించాలి. ఇందులో తప్పు జవాబులు గుర్తించినా మైనస్‌ మార్కులు ఉండవు. ఇలా మూడు సబ్జెక్టుల్లోనూ ప్రశ్నపత్రం ఇస్తారు. అంటే మొత్తం 90 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో సిలబస్‌ తగ్గించడం, మరికొన్ని చోట్ల తగ్గించకపోవడం తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని హేతుబద్ధీకరణ కోసం ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఎన్‌టీఏ వివరించింది. అంటే గత ఏడాది పాఠ్య ప్రణాళికే ఉంటుంది. బీఆర్క్‌ పేపర్‌-2లోనూ ఇదే పాటిస్తారు.

తెలంగాణలో కొత్తగా 4 చోట్ల పరీక్ష కేంద్రాలు
గత సెప్టెంబరులో జరిగిన జేఈఈ మెయిన్‌కు తెలంగాణలో ఆరు నగరాల్లో (హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌) మాత్రమే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా నిజామాబాద్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, సిద్దిపేటలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో మాత్రం మార్పు లేదు.

జేఈఈ-2021 స్టడీమెటీరియల్

రసాయన శాస్త్రం భౌతికశాస్త్రం గణితశాస్త్రం
పాత ప్రశ్నపత్రాలు నమూనా ప్రశ్నపత్రాలు  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.