• facebook
  • whatsapp
  • telegram

వైద్య ఆరోగ్య శాఖలో మ‌రో వెయ్యి పోస్టులు

* మొత్తం 3,298 ఉద్యోగాల‌ భర్తీకి ఉన్నత స్థాయిలో కసరత్తు
* మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నియామకాలు


ఈనాడు, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. గతంలో ప్రకటించిన వాటితోపాటు మరో వెయ్యి కలిపి 3,298 పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాల ప్రక్రియపై ఉన్నత స్థాయిలో డిసెంబ‌రు 17న‌ చర్చించారు. వాస్తవంగా 12,289 పోస్టులను గతంలోనే ముఖ్యమంత్రి మంజూరు చేసి 9,381 పోస్టుల నియామకానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే 2,272 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం 4,811 పోస్టుల‌ భర్తీ ప్రక్రియలో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 2,298 భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 275 వైద్యులు, 957 నర్సులు, 1,011 పారా మెడికల్‌ పోస్టులున్నట్లు పేర్కొంటున్నారు. మరో వెయ్యి పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు.

నియామక బోర్డు ద్వారానే భ‌ర్తీ
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఆర్‌బీ) సిద్ధమవుతోంది. బోర్డు ద్వారా వైద్య పోస్టులు భర్తీ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేపట్టేవారు. దానివల్ల జాప్యం జరుగుతోందని ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసింది. శాఖ పరిధిలో పదవీ విరమణలు, ఖాళీలు ఏర్పడగానే ఆ సమాచారం బోర్డుకు చేరుతుంది. అనంతరం ఆ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడతారు. ప్రాథమిక ఆరోగ్య, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల వరకు అన్ని స్థాయుల్లో పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు బోర్డే పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సేవల అవసరార్థం చాలా ఆసుపత్రులకు తాత్కాలిక పద్ధతిలో వైద్యులు, నర్సులను నియమించారు. ఈ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉండగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ నడుస్తోంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.