ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, బీఫార్మసీ ప్రైవేటు కళాశాలలకు గతేడాది బోధన రుసుములనే కొనసాగిస్తూ ప్రభుత్వం డిసెంబరు 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రుసుములు ఈ ఏడాది నుంచి మూడేళ్లపాటు 2022-23 వరకు అమల్లో ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 240 ఇంజినీరింగ్, నాలుగు ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజినీరింగ్ కళాశాలలకు బోధన రుసుములను నిర్ణయించారు. వీటిలోనే విద్యార్థులకు ఇచ్చే గుర్తింపుకార్డు, వైద్య, క్రీడ, సాంస్కృతిక, కంప్యూటర్, కళాశాల మ్యాగజైన్, విద్యార్థి ఆరోగ్య రక్ష పథకం, సంక్షేమ నిధి, స్టడీ పర్యటన, పరీక్షలు, కళాశాల అభివృద్ధి, తదితరాలన్నింటినీ కలిపేశారు. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతేడాది విద్యార్థి ఒకసారి చెల్లించేలా రూ.2 వేలు, ప్రతి ఏడాది విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సిన ఫీజు కింద రూ.1,850, గ్రంథాలయం, ప్రయోగశాల డిపాజిట్ కింద రూ.వెయ్యి వసూలు చేసుకునేందుకు కళాశాలలకు అవకాశం కల్పించగా.. ఈసారి వాటిని బోధన రుసుముల్లోనే కలిపేశారు. దీనివల్ల ఒక్కొక్కరికీ రూ.5 వేల దాకా తగ్గినట్లే.
* ఇంజినీరింగ్ కళాశాలలకు కనిష్ఠంగా రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.70 వేల ఫీజు నిర్ణయించారు. గతేడాది 281 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులను నిర్ణయించగా.. ఈసారి ఆ సంఖ్య 240కి తగ్గింది. 41 కళాశాలలల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఉండవు.
* రాష్ట్రంలో 113 బీఫార్మసీ ప్రైవేటు కళాశాలలకు బోధన రుసుములను నిర్ణయించారు. కనిష్ఠం రూ.35 వేలు అయితే గరిష్ఠం రూ.65,900.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.