ఈనాడు, అమరావతి: ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్ల కుదింపునకు వీలు కల్పిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఇంటర్మీడియట్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియనూ తప్పుపట్టింది. సీట్లు, ప్రవేశాల్లో గత విధానాన్నే ప్రస్తుత విద్యా సంవత్సరమూ పాటించాలని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఆన్లైన్ ప్రవేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తే.. విధివిధానాలను రూపొందించుకున్నాకే ముందుకెళ్లాలని తేల్చి చెప్పింది. డిగ్రీలో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని కొట్టేసింది. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ప్రభుత్వం.. నిబంధనలను రూపొందించి జీవో జారీ చేసిందని తెలిపింది. ఇంటర్మీడియట్ ఆన్లైన్ ప్రవేశాలపై విధివిధానాలు, జీవో లేవని గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు డిసెంబరు 24న తీర్పు ఇచ్చారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్లు కుదించేందుకు వీలుగా విద్యాశాఖ ఈ ఏడాది మే 13న జారీ చేసిన జీవో 23ను సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కె.బ్రహ్మయ్య, గీతాంజలి జూనియర్ కళాశాల యాజమాన్యం హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. మీడియా ప్రకటన ద్వారా ఆన్లైన్ ప్రవేశాల గురించి అధికారులు వెల్లడించారన్నారు. హడావుడిగా ఆన్లైన్ ప్రవేశాలు చేపడుతుండటంతో ప్రైవేటు కళాశాలలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రెస్నోట్ ఇచ్చి ఆన్లైన్లో ప్రవేశాలు చేపడతామంటే కుదరదని స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.