* 85వేల మంది విద్యార్థుల నిరీక్షణ
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఐచ్ఛికాల కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలలకు ప్రతి ఏటా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేస్తుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన కళాశాలలకు ఎంసెట్ కన్వీనర్ ప్రవేశాలు నిర్వహిస్తారు. డిసెంబరు 23 వరకు బోధన రుసుముల నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూడగా.. ఇప్పుడు కళాశాలలు, సీట్లకు సంబంధించిన ఉత్తర్వుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు 85,702 మంది విద్యార్థులు గత రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసేందుకు నిరీక్షిస్తున్నారు. అక్టోబరు 23న నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇప్పటికీ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి కాలేదు. మొదటి ఏడాది వారికి డిసెంబరు 31 నుంచి తరగతులు నిర్వహించాలని ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ఆలస్యం కారణంగా ఈ సమయంలో తరగతులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.