ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ శాఖల పరిధిలోని పలు విభాగాల పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 8 వేలకు పైగా గురుకుల ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులు కలిపి 12 వేలకు పైగా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. బీసీ గురుకులాల్లో 3,500కుపైగా ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇదే శాఖలో 200 సంక్షేమ వసతి గృహ అధికారుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు 3,700కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 1000, గిరిజన గురుకులాల్లో 1400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీసీసీ, కార్పొరేషన్ ఇతర విభాగాలు కలిపి 4 వేలకు పైగా పోస్టుల ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. ఎస్సీ సంక్షేమ శాఖలో 2 వేలకు పైగా, మైనార్టీ సంక్షేమ శాఖలో 1500 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు పోస్టుల కేడర్ పునర్విభజన, సర్వీసు నిబంధనలకు సంబంధించి ముసాయిదా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ విభాగాల నుంచి సూచనలు తీసుకుని నియామకాలపై తుది ఆదేశాలు ఇవ్వాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.