• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో చేరిన వారికే బోధన రుసుము 

* ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు వసతి దీవెన, విద్యాదీవెన పథకాల నిలిపివేత
* ఉత్తర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో ఎంటెక్‌, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం బోధన రుసుములు చెల్లించదు. 2020-21 నుంచి ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో పీజీ కోర్సుల్లో చేరే వారికి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవని స్పష్టం చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ డిసెంబ‌రు 25న‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో చేరిన వారికి మాత్రమే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తగిన మార్పులు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బోధనరుసుములు, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఏటా రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చుల కోసం చెల్లిస్తోంది.

* ఏటా లక్ష మంది చేరిక‌..
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఏటా లక్ష మంది మంది వరకు పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి విద్యార్థులే బోధన రుసుములు చెల్లించాలి. వీటితో పాటు గతేడాది పీజీ కళాశాలల్లో ఏయే కోర్సుకు ఎంత బోధన రుసుము చెల్లించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2018-19 వరకు ఏఎఫ్‌ఆర్‌సీ(ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిషన్‌) నిర్ణయించిన ప్రకారం ఎంటెక్‌కు రూ.57 వేలు, ఎంఫార్మసీ రూ.1.10 లక్షలు, ఫార్మాడీ(పోస్టు బ్యాచిలర్‌) రూ.68 వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ.27 వేలు బోధన రుసుము ఉండేది.

* తేల‌ని గతేడాది లెక్కలు..
గత విద్యాసంవత్సరానికి(2019-20) సంబంధించి పీజీ కోర్సులకు బోధన రుసుముల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 2018-19కి సంబంధించి 6 నెలలు, గతేడాది బకాయిలు కలిపి మొత్తం రూ.550 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.