• facebook
  • whatsapp
  • telegram

పాఠ‌శాలలు నడిచేది 65 - 70 రోజులే!

విద్యార్థుల హాజరుకు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి
‣​​​​​​​ తరగతి గదికి గరిష్ఠంగా 20 మంది
‣​​​​​​​ 9, 10 త‌ర‌గ‌తుల‌ వారికి మధ్యాహ్న భోజనం
‣​​​​​​​ ఆన్‌లైన్‌ విధానం ఎంచుకునే స్వేచ్ఛ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం (2020-21)లో కేవలం 65-70 రోజులు మాత్రమే పాఠశాలలు నడవనున్నాయి. పాఠశాలలను ఏప్రిల్‌ వరకే నడిపి, మే నెలలో పదో తరగతి పరీక్షలు జరపాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటిస్తూ విద్యాసంస్థలను నడపనున్నారు. భౌతికదూరం తప్పనిసరి కనుక, ఒక్కో గదికి గరిష్ఠంగా 20 మందికి మించి విద్యార్థులను అనుమతించరు. విద్యార్థులు బడికి రావాలంటే తల్లిదండ్రుల లిఖితపూర్వక అంగీకారం తప్పనిసరి. బడికి పంపడానికి ఇష్టపడకుంటే ఆన్‌లైన్‌ విధానంలో చదువుకునేలా ఆప్షన్‌ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఏప్రిల్‌ నెలాఖరు వరకే తరగతులు
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలు కలిపి మొత్తం 89 రోజులు. వాటిల్లో ఆదివారాలు, సెలవులు తీసివేస్తే మిగిలేది 70 రోజులే. రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేస్తాయని చెబుతున్నారు. జాతీయ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు- ఇంటర్‌ పరీక్షలతో ముడిపడి ఉన్నందున ఆ పరీక్షలను ఏప్రిల్‌ నెలాఖరులోనే ప్రారంభిస్తారు. విద్యార్థులు మే 24 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. 11 పరీక్షలకు బదులు ఆరు పరీక్షలే జరిపే ఆలోచనలో అధికారులున్నారు. 6, 7, 8 తరగతుల గురించి ప్రభుత్వం స్పష్టం చేయలేదు.

ఇవీ నిబంధనలు.. ప్రణాళిక
* విద్యార్థులు ఎక్కువ, సౌకర్యాలు తక్కువగా ఉంటే షిఫ్టు విధానంలో కూడా పాఠశాలలను నడిపే అవకాశం ఇస్తారు. ఉదయం పదో తరగతి, మధ్యాహ్నం తొమ్మిదో తరగతి జరుపుకోవచ్చు. ఆరుబయట కూడా తరగతులు నిర్వహించుకోవచ్చని ఒక అధికారి చెప్పారు.
* ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజు నుంచే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.