* ప్రశ్నపత్రాలపైనా త్వరలో నిర్ణయం
* ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో బడులు
* ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి
ఈనాడు, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ పరీక్షలను 11 ప్రశ్నపత్రాలతోనా లేక ఆరింటితో నిర్వహించాలా అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని, ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు ఉండొచ్చని తెలిపారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తామని, కేంద్రం జారీ చేసే కొవిడ్-19 నిబంధనలను పరిశీలించి 1-5 తరగతులకు బడులు పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఉన్నత విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది 40కిపైగా కళాశాలలను మూసివేశామని వెల్లడించారు.
* 2017-18 వైద్య విద్య ఫీజులపై హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా ఫీజులు నిర్ణయిస్తామని, కళాశాలల నుంచి ఆదాయ, వ్యయాలు సేకరించి కళాశాలల వారీగా ఫీజులు నిర్ణయిస్తామని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. కళాశాలలు యాజమాన్య కోటాను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉండగా దీన్ని ఉల్లంఘిస్తున్నాయని, ఈ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్ చేయడం ద్వారా పేదలకు సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.