• facebook
  • whatsapp
  • telegram

కొలువుకు కావాలి కోడింగ్ నైపుణ్యం

బీటెక్‌ విద్యార్థులకు కంపెనీల బ్రహ్మరథం

వార్షిక వేతనం రూ. 20-33 లక్షలు

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న యువత

ఈనాడు - హైదరాబాద్‌, అమరావతి: పట్టుమని 22 సంవత్సరాలు కూడా లేని కొందరు బీటెక్‌ విద్యార్థులు ప్రారంభంలోనే ఆరు అంకెల వేతనాన్ని అందుకుంటున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఘనమైన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. ప్రముఖ ఐఐటీల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఏకంగా రూ.20 లక్షల నుంచి రూ.33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వారిలో చాలా మంది ప్రభుత్వ బడుల్లో చదివిన వారే. 

సాధారణ కుటుంబాలకు చెందిన బీటెక్‌ విద్యార్థులు చదువు పూర్తయ్యిందో లేదో ఐటీ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫలితంగా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారిపోనుంది. ప్రొడక్ట్‌ కంపెనీలు కొత్త సాఫ్ట్‌వేర్లను అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, ఐబీఎం లాంటి సంస్థలు అత్యంత ప్రతిభావంతులను గుర్తించి భారీ వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. రెండు మూడు సంవత్సరాలుగా కోడింగ్‌ సత్తా ఉంటే చాలు ఏ కళాశాల విద్యార్థి అయినా మంచి ఆఫర్లను అందుకుంటున్నారు. పలు కంపెనీలు నిర్వహించే కోడింగ్‌ పోటీలు మెరిట్‌ విద్యార్థులకు ఊతమిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది!

ఏపీ, తెలంగాణ నుంచి రూ.20 లక్షలు, ఆపైన వార్షిక వేతనంతో ఎంపికైన వారు దాదాపు 250-300 మంది ఉంటారని అంచనా. తెలంగాణలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతిలోనే 30 మంది, సీబీఐటీలో 20, వాసవిలో 23 మంది, నారాయణమ్మలో 20 మంది వరకు ఎంపికయ్యారు. గోకరాజు రంగరాజులో ముగ్గురు, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ఇద్దరు భారీ ప్యాకేజీలను అందుకున్నారు. ఇతర కళాశాలల్లో చదివిన మరికొందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన కె.సాయి రిష్వంత్‌ రూ.24 లక్షలు, కాట్రగడ్డ రితిక, వెంకటసాయి నిఖిత్‌లు రూ.29.50 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌కు ఎంపికయ్యారు. కేఎల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన భానురేఖ రూ.25 లక్షలతో సర్వీస్‌నౌ కంపెనీలో ఉద్యోగం పొందారు. విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి నలుగురు రూ.31.25 లక్షల ప్యాకేజీకి, మరొకరు రూ. 28 లక్షల వేతనానికి అమెజాన్‌లో కొలువు సంపాదించారు.

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లోనూ..

ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న పేద పిల్లలు కూడా ప్రాంగణ నియామకాల్లో మంచి ప్యాకేజీలను అందుకున్నారు. ఇడుపులపాయ నుంచి ముగ్గురు రూ.28 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయేషా, బాలచంద్రారెడ్డి ట్రిపుల్‌‌ఐటీలకు ఎంపికై ఉత్తమ వేతన కొలువులు సాధించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి 10 మంది విద్యార్థులు బెంగళూరులోని అనలాగ్‌ డివైజెస్‌కు రూ.20 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు. వీరందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన పేద కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.

సగంమంది అమ్మాయిలే

తెలుగు రాష్ట్రాల్లో ఏటా 1.50 లక్షలమంది విద్యార్థులు బీటెక్‌లో చేరుతున్నారు. వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే. భారీ వేతనంతో ఎంపికవుతున్న వారిలో మాత్రం కనీసం వీరు సగంమంది ఉంటున్నారు. ‘నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కచ్చితత్వంతో ఉంటారు. నిజాయతీగా పనిచేస్తారు. తరచూ ఉద్యోగాలు మారరని పరిశ్రమలు నమ్ముతున్నాయి. అందుకే అమ్మాయిలకు పెద్దపీట వేస్తున్నాయని’ ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు.

ఒక్కసారి కూడా తప్పని వారికే..

ఉద్యోగాల పోటీలో పాల్గొనాలంటే కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. మరికొన్ని ఉత్పత్తి తరహా ప్రముఖ కంపెనీలు 70 శాతం మార్కులు ఉంటేనే రాత పరీక్షలకు, ముఖాముఖీలకు ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉండటంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశించిన వారిలో సగంమందికి లోపే ఉద్యోగాలకు పోటీపడేందుకు అర్హత పొందుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, పెగా సిస్టమ్స్‌ లాంటి పలు సంస్థలు మూడో సంవత్సరం వరకు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలని, మూడేళ్లలో ఒక్కసారి కూడా తప్పి ఉండరాదని నిబంధనలు విధిస్తుంటాయి. కనీసం ప్రథమ శ్రేణి మార్కులు సాధిస్తేనే వడపోత పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తాయి.

ముందు ఇంట‌ర్న్‌షిప్‌.. తర్వాత కొలువు

భారీ వేతన ప్యాకేజీతో ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు ఎక్కువ శాతం ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. పనితీరు గమనించి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వేతనం అందుతుంది. తర్వాత వారికి పూర్తిస్థాయిలో కొలువులు ఇస్తున్నాయి. 70-80 శాతమే ఎంపికవుతారని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. ప్రతిభ ఆధారంగా కొందరిని మాత్రం నేరుగా ఫుల్‌టైమ్‌ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

అత్యధిక ప్యాకేజీలకు మూడేళ్ల ప్రణాళిక

-వెంకట్‌ కాంచనపల్లి, సన్‌టెక్‌ కార్ఫ్‌ సీఈఓ

బీటెక్‌ నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లోనే ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి. అంటే మొదటి మూడేళ్లే కీలకం. నియామక స్థాయిని బట్టి కంపెనీలు 3 నుంచి 6 రౌండ్ల పరీక్షలు నిర్వహిస్తాయి. మొదటి రౌండు ఆప్టిట్యూడ్‌, ఆంగ్లం, ప్రోగ్రామింగ్‌ మీద జరుపుతారు. రెండో రౌండు నుంచి కోడింగ్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. రాత పరీక్షలు పూర్తయితే ముఖాముఖీలకు షార్ట్‌ లిస్టు చేస్తాయి. ఇంటర్వ్యూవర్‌కి లాజిక్‌ ఎలా ఉందనేది ముఖ్యం. అందుకు ఏ సంవత్సరంలో ఏం నేర్చుకోవాలో ప్రణాళిక వేసుకోవాలి.

మొదటి ఏడాది: ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో సమస్య పరిష్కారశక్తి (ఆప్టిట్యూడ్‌), ఆంగ్లం (వర్బల్‌ ఎబిలిటీ)తోపాటు సీ/జావా/ఫైథాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ల్లో ఒక దాంట్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.

రెండో ఏడాది: డేటా స్ట్రక్చర్స్‌పై పట్టు సాధించి కోడింగ్‌ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తొలుత సులభమైన ప్రాబ్లెం స్టేట్‌మెంట్లను పరిష్కరించాలి. అవకాశం ఉన్నపుడల్లా కంపెనీలు నిర్వహించే కోడింగ్‌ పోటీల్లో పాల్గొనాలి.

మూడో ఏడాది: సమస్యాత్మకమైన వాటిని పరిష్కరించే స్థాయికి ఎదగాలి. తెలిసిన వారు ఎవరైనా కంపెనీల్లో పనిచేస్తుంటే వారిని మెంటార్‌గా ఎంపిక చేసుకోవాలి. వారి సహకారంతో కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్సెస్‌, మొబైల్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌ లాంటి ఏదైనా ఒక డిజిటల్‌ టెక్నాలజీలో ఒకటి రెండు ప్రాజెక్టులు చేయాలి. కోడింగ్‌ సామర్థ్యంతో బయోడేటా తయారు కాగానే ఇంటర్న్‌షిప్‌ల వేట మొదలుపెట్టాలి. గూగుల్‌, గోల్డ్‌మన్‌ శాచె, అడోబ్‌ లాంటి సంస్థలు రెండో సంవత్సరం విద్యార్థులను, మైక్రోసాఫ్ట్‌ లాంటి కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లకు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష స్టైఫండ్‌తో ఎంపిక చేసుకుంటున్నాయి. వారు ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వేతనంతో కొలువు సంపాదిస్తున్నారు.

పెద్ద ప్యాకేజీ రావాలంటే కోడింగ్‌ నైపుణ్యం ఉండాలి

- వెంకట్‌, సంచాలకులు, గాయత్రి విద్యా పరిషత్‌

‘‘ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కోడింగ్‌ నైపుణ్యాలు ఉండాలి. కోడింగ్‌లో రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి. మొదటి విడతలో నార్మల్‌ కోడింగ్‌, రెండో విడతలో అడ్వాన్స్‌డ్‌ కోడింగ్‌ ఉంటాయి. అడ్వాన్స్‌డ్‌ క్వాంట్‌, రీజనింగ్‌, లాజిక్‌పై ప్రశ్నలు చేయగలిగేవారే పరీక్షల్లో రాణిస్తారు. టెక్నికల్‌ ఇంటర్వ్యూలో డిజిటల్‌ టెక్నాలజీపైనా ప్రశ్నలు ఉంటాయి. మూడో సెమిస్టర్‌ నుంచే ప్రొగ్రామింగ్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా స్ట్రక్చర్స్‌పై విద్యార్థులు దృష్టిపెట్టాలి. జావా, పైథాన్‌, సీ, సీ++ ప్రొగ్రామింగ్‌పై పట్టుండాలి. సాధారణ పరీక్షలకు చదివినట్లు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోదు.’’ 

అమెజాన్‌లో రూ.25 ల‌క్ష‌ల వార్షిక వేత‌నం

- ఆళ్ల లిఖితారెడ్డి, హైదరాబాద్

నాన్న చిన్నప్పుడే చనిపోయారు. సొంతూరు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం. అమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రూ.11 వేల వేతనంతో పనిచేస్తూ నన్ను, నా తమ్ముడిని చదివిస్తోంది. వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఐటీ బ్రాంచి చదువుతూ రూ. 25 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌ సంస్థకు ఎంపికయ్యాను. ఇంజినీరింగ్‌లో చేరిన నాటినుంచి కోడింగ్ అంటే ఇష్టం ఉండేది. నాకు వ‌చ్చే వేతనంతో అమ్మకు సొంతూరులో ఇల్లు కట్టించాలని నా కోరిక. కొలువుకు ఎంపికయ్యానని అమ్మకు చెప్పినప్పుడు ఎంతో సంతోషించింది.  

రూ.7 లక్షలు చాలనుకుంటే రూ.31.25 లక్షలు

- ఆతీ నాగసాయి ఆదిత్య, విశాఖపట్నం

‘‘మా సీనియర్‌కు గూగుల్‌లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అదే నాలో స్ఫూర్తి కలిగించింది. అందుకే సీఎస్‌ఈ కోర్సులో చేరా. తొలిసారి నియామక ప్రక్రియలో విజయం సాధించలేదు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ నిర్వహించిన ముఖాముఖిలో తిరస్కరణకు గురికావడం ఎంతో బాధించింది. అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమెజాన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా రూ. 31.25 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యా. కనీసం రూ. 7 లక్షల ప్యాకేజీ వస్తే చాలనుకున్నా. కానీ, భారీ ప్యాకేజీ దక్కడంతో ఆశ్చ‌ర్యానికి గుర‌య్యా’’  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.