‣ మంజూరైన వాటిలో భర్తీ కానివి 39%
‣ 16.81% ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సేవలు
‣ పీఆర్సీ నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయని రాష్ట్ర వేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులకుగాను ప్రస్తుతం 3,00,178 (61%) మందే పనిచేస్తున్నారు. అంటే మొత్తం పోస్టుల్లో 39 శాతం ఖాళీలే. రాష్ట్రంలో ప్రతి వేయి మందికి 8.5 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జనాభా 3.52 కోట్లు కాగా మంజూరైన పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి వేయి మంది జనాభాకు 14 మంది ఉద్యోగులుండాలి. ఖాళీల దృష్ట్యా 8.5 మంది మాత్రమే ఉన్నారు. జనాభా, మంజూరు పోస్టుల పరంగా చూస్తే నిష్పత్తి 1.40 శాతం మాత్రమే ఉంది.
‣ అయిదు శాఖల్లో అత్యధికం
రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలుండగా అయిదు శాఖల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖలో 1,37,851 మంజూరీ పోస్టులకు 1,13,853 మంది పనిచేస్తున్నారు. హోంశాఖలో మొత్తం 98,394 మంజూరీ పోస్టులకు 61,212 మంది పనిచేస్తున్నారు. వైద్యఆరోగ్య శాఖలో 52,906 పోస్టులు మంజూరు కాగా అందులో 22,336 మంది ఉన్నారు. రెవెన్యూ శాఖలో 27,786లో 19,825, పంచాయతీరాజ్ శాఖలో 26201కి గాను 13573 మంది మాత్రమే ఉన్నారు. ఇలా మొత్తం అయిదు శాఖల్లోనే రాష్ట్రంలోని 3,42,938 (69.80%) మంజూరీ పోస్టులున్నాయి. పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2,30,799 (76.88%) మంది వీటిల్లోనే ఉన్నారు.
‣ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు
ఖాళీలు భర్తీ కాకపోవటంతో ప్రభుత్వ శాఖల్లో 50,400 మంది ఒప్పంద, 58,128 మంది పొరుగు సేవల ఉద్యోగులు(16.81%) పనిచేస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.