* మిగిలిన 3 లక్షల సీట్లు
ఈనాడు, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా చేపట్టిన ప్రవేశాల ప్రక్రియలో 39.45 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల కళాశాలల్లో కలిపి 4,96,055 సీట్లు ఉండగా మొదటి విడతలో 1,95,700 మంది విద్యార్థులు చేరారు. ఆన్లైన్ ప్రవేశాలపై అవగాహన లోపించి చాలామంది ఒకే కళాశాలకు ఐచ్ఛికాలు ఇచ్చారు. ఈసారి ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ రిజర్వేషన్ విధానం అమలు చేశారు. దీనిపై అవగాహన లేని విద్యార్థులు తమ ఇళ్లకు సమీపంలోని విద్యాసంస్థలకే ప్రాధాన్యమిచ్చారు. ఒకే కళాశాలను ఎంపిక చేసుకోవడంతో కొందరు సీట్లు కోల్పోయారు. కొన్నిచోట్ల ముందుగానే సీట్లు భర్తీ చేసుకున్న యాజమాన్యాలు విద్యార్థుల తరఫున వారే ఐచ్ఛికాలు నమోదు చేశారు. దీంతో ఆప్షన్స్ ఇచ్చిన వారు సీట్లు పొందలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,401 మంది ఒకే కళాశాలను ఎంచుకున్నారు.
సాధారణ డిగ్రీల్లో ఎక్కువ మంది విద్యార్థులు బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకే ఆసక్తి చూపారు. మొత్తం సీట్లలో ఈ రెండు కోర్సుల్లోనే 3,95,268 సీట్లు (సుమారు 80%) ఉండగా 1,64,543 మంది చేరారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న భావనతో సంప్రదాయ బీఏ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోతున్నాయి. మొత్తంగా మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.