* జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా మార్పు
* నర్సరీ నుంచి 2వ తరగతి వరకు పాఠ్యప్రణాళిక తయారీకి ఎస్సీఈఆర్టీ సన్నాహాలు
* అంగన్వాడీల్లోనూ ఆ పాఠ్యప్రణాళిక పుస్తకాలే వినియోగం
ఈనాడు, హైదరాబాద్: కేంద్రం రూపొందించిన జాతీయ నూతన విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్యలో వివిధ తరగతుల పాఠ్యప్రణాళికను రూపొందించడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతోపాటు మొదటి, రెండు తరగతుల పాఠ్యప్రణాళికపై రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) అధికారులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖ నిర్మాణం 10+2 విధానంలో ఉండేది. నూతన విద్యావిధానం ప్రకారం దాన్ని 5+3+3+4గా మార్పు చేశారు. ఇందులో మొదటి అయిదు సంవత్సరాలు నర్సరీ నుంచి రెండో తరగతి వరకు ప్రారంభ దశగా పిలుస్తారు. అంటే విద్యార్థి మూడో సంవత్సరం నిండగానే నర్సరీలో చేరాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ వయసు వారు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేవారు. వాటిని పాఠశాలలకు అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 31 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు 12 వేల అంగన్వాడీ కేంద్రాలను 2018-19 విద్యాసంవత్సరంలోనే పాఠశాలలకు అనుసంధానం చేశారు. ప్రతిఏటా రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది నర్సరీలో చేరాల్సి ఉండగా.. అందులో 40 శాతం మందే ప్రవేశాలు పొందుతున్నారు.
* సిలబస్లో ఏముంటుందంటే?
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను శిశు విద్య(ప్రీ ప్రైమరీ)గా పిలుస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన పిల్లలకు ఎల్కేజీ, యూకేజీ స్థాయికి మహిళా, శిశు సంక్షేమ శాఖ పాఠ్య పుస్తకాలను రూపొందించి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా చదువు నేర్పుతున్నారు. ఇప్పుడు నర్సరీతోపాటు ఎల్కేజీ, యూకేజీకి కొత్త విద్యావిధానం మేరకు పాఠ్య ప్రణాళిక తయారీ చేస్తారు. విద్యార్థులు ఆటలు, క్రియాశీల ఆవిష్కరణలు, అనుభవపూర్వక అభ్యాసనం ద్వారా పాఠాలు నేర్చుకోవాలన్నది లక్ష్యం. బొమ్మలు, కథలు, ఆటపాటలతో పాఠశాలకు అలవాటుపడేలా సిలబస్ రూపొందించాలని విద్యావిధానంలో చెప్పారని ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరు చెప్పారు. ఇందులో రంగులు గుర్తించడం, వాటిని బొమ్మలకు వేయడం, చేతులతో వివిధ భాగాలను అంటించడం లాంటివి ఉంటాయన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన పుస్తకాలనూ పరిశీలిస్తామని, ఆ శాఖ అధికారులతో కలిసి సిలబస్ రూపొందిస్తామన్నారు.
* జాతీయ స్థాయి విద్యాప్రణాళిక వచ్చిన తర్వాతే..
నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు తరగతుల వారీగా సిలబస్ ఉండేలా జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ).. జాతీయ కరికులమ్ ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్)ను రూపొందిస్తోంది. ఆ కరికులమ్ను మార్చి/ఏప్రిల్లో విడుదల చేస్తామని అధికారులు ఇప్పటికే రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. దాన్ని పరిశీలించి రాష్ట్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులతో సిలబస్ రూపొందిస్తామని ఓ అధికారి చెప్పారు. రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి తొలుత నర్సరీలో కొత్త పాఠ్యప్రణాళికతో పాఠ్య పుస్తకాలు అమల్లోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంగన్వాడీల్లోనూ ఆ పుస్తకాలనే వినియోగిస్తారు. అంగన్వాడీ బోధకులకు కూడా శిక్షణ ఇస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.