‣ ఏయే అంశాలపై దృష్టి సారించాలి?
‣ మార్చి 31 నుంచి ప్రారంభం
విజయవాడ విద్య, న్యూస్టుడే: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులకు మార్చి 31 నుంచి ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. ప్రస్తుతం తగ్గించిన సిలబస్ ప్రకారం.. పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం చాలా వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. డిసెంబరు నుంచి తరగతి గదుల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మేలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. కొవిడ్ కారణంగా 30 శాతం ఇంటర్ సిలబస్ తగ్గించారు. ప్రాక్టికల్స్కు కూడా ఇందుకు అనుగుణంగానే మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు ఏయే అంశాలపై దృష్టి సారించాలో పేర్కొంటూ..
‣ భౌతిక శాస్త్రంలో..
గతంలో భౌతిక శాస్త్రం ప్రాక్టికల్స్లో 38 ప్రశ్నలు ఉండేవి. ప్రస్తుతం ఈ ఏడాది కేవలం 28 ప్రశ్నలు మాత్రమే ఉంటున్నాయి. ఎక్కువగా వెర్నియర్ కాలిపర్స్, స్క్రూగేజ్ దోషనిర్ధరణ, సున్నితపు త్రాసు ఉపయోగించి ఇచ్చిన వస్తువు ద్రవ్యరాశిని లెక్కించడం, లఘు లోలకం, బాయిల్స్ నియమాన్ని ఉపయోగించి ఇవ్వబడిన వస్తువును వివిధ సానాల్లో ఉంచి, ఎత్తులు కనుక్కోవడం నేర్చుకోవాలి. వాటితో పాటు సమాంతర చతుర్భుజ, త్రిభుజ నియమాన్ని ఉపయోగించి రాయి బరువు, రాయి ఘన పరిమాణం కనుక్కోవడం సాధన చేయాలి. అలానే బల సిరాంకము, కటకము, దర్పణముల ప్రయోగాల ద్వారా వక్రీభవన, పరావర్తన నియమాలను లెక్కించడం సాధన చేయాలి. రే ఆప్టిక్స్ నుంచి వక్రీభవన గుణకము, ప్రిజమ్(పట్టకము) వంటివి ఎక్కువ సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ధ్వని వేగమును కనుక్కోవడం, అయస్కాంత తటస బిందువులను గీయడం, ఓమ్ నియమాన్ని టాన్జెంట్ గాల్వానా మీటరు ద్వారా అప్లె చేయడం వంటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
‣ వృక్షశాస్త్రంలో..
➡ విభాగం- ఏలో ..6
ఇందులో వృక్ష వర్గీకరణకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సోలన్సీ, లిలిన్సీ కుటుంబాలకు చెందినవి ఉంటాయి. దీనికి సంబంధించి సాంకేతిక వర్ణన రూపంలో సమాధానాలు రాయాలి. శారీరక్ష లక్షణాలు, పుష్ప లక్షణాలు, కుటుంబం గుర్తింపు, పుష్ప చిత్రాలను గీయాలి.
➡ బీలో.. 6
మొక్కల అంతర్భాగ నిర్మాణానికి సంబంధించి స్లెడ్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులకు ద్విదళ, ఏకదళ బీజకాండానికి చెందిన పటాలను సాధన చేయడంతో పాటు జాతి లక్షణాలను పరిశీలించాలి..
➡ సీలో.. 6
దీనిలో లైవ్ ఎక్సిపెరిమెంట్సు ఉంటాయి. పొటాటో ఆస్మోసిస్, ప్లాస్మాలసిస్, కోబాల్టు క్లోరైడ్ పేపర్ ప్రయోగాలలో ఒకటి లాటరీ విధానం ద్వారా ఒక ప్రశ్న ఇస్తారు.
➡ డీలో.. 5
ఇందులో స్లెడ్సు కానీ స్పోటర్స్ను కానీ డిస్ప్లే చేస్తారు. వాటిని గుర్తించి వాటికి సంబంధించిన కారణాలను క్లుప్తంగా రాయాల్సి ఉంటుంది. వీటిని డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్ విభాగాలుగా విభజించి స్లెడ్ చేస్తారు.
➡ పార్ట్ ఈలో ఇలా..
రికార్డులకు 5, హెర్బేరియానికి 2 మార్కులు కేటాయిస్తారు.
‣ రసాయన శాస్త్రంలో..
➡ వాల్యుమెట్రిక్ విశ్లేషణకు.. 8
ఇందులో ఎయిమ్, పరికరాలు, కెమికల్స్, ప్రిన్సిపుల్, ప్రొసీడర్ విషయాలను ఇచ్చిన జవాబు పత్రం రాసి ఇన్విజిటేలర్కు ఇవ్వాలి. ఎండ్ పాయింట్ కనుగొని ఎగ్జామినర్కు తెలియజేసి పట్టికలో రాయాలి. ఎండ్ పాయింట్ ఉపయోగించి తెలియని ద్రావణం మొలారిటీ, బరువు కనుగొనాలి.
➡ లవణ విశ్లేషణ.. 10
ప్రాథమిక పరీక్షలు చేయాలి. యాన్ అయాన్ను, క్యాటయాన్ కనుగొని నిర్ధరించి వీటిని రిపోర్టులో నమోదు చేయాలి. వీటితో పాటు లియోఫిల్స్, లియోఫోబిక్ల పాటు ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్స్ కనుగొని నిర్ధారించాలి. వీటికి 6, వైవా ప్రశ్నలకు 2, ప్రాజెక్టు రికార్డులకు 4 మార్కులు.
‣ జంతు శాస్త్రంలో..
➡ విభాగం- ఏలో .. 6
జీవుల అంతర్ నిర్మాణ వ్యవసల పటాలను, గీసి వ్యవసలను గుర్తించి కనీసం 4 భాగాలు గుర్తించాలి.
• ఇందులో వానపాము వ్యవసలు, బొద్దింక వ్యవస్థలు, మానవ అంతర్నిర్మాణ వ్యవస్థలు ఉంటాయి.
➡ బీలో.. 5
ఇచ్చిన నమూనాల్లో స్టార్చ్, గ్లూకోజ్, లిపిడ్లు, ఆల్బూమిన్లు ఉనికిని గుర్తించేందుకు పరీక్షలు చేయాలి. మొత్తం 4 ప్రయోగ విధానాలపై విద్యార్థులు దృష్టి సారించాలి.
➡ సీలో 14..
ఈ విభాగంలో 7 స్పాటర్స్ను గుర్తించి పటాలు గీచి, గుర్తింపు లక్షణాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 7 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 2 మార్కులు కేటాయిస్తారు. రికార్డు రాసినందుకు.. 5 మార్కులు.
సాధనకు సమయం కేటాయించాలి
- జీవీరావు
విద్యార్థులు ఎక్కువగా సాధనపై దృష్టి సారించాలి. ఇందుకు సంబంధించిన వివరాలను నేర్చుకుని అవసరమైన చిత్రాలను సాధన చేయాలి. సిలబస్ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించినది.. చిన్న చిన్న టాపిక్సు చదవడం వల్ల ఎంసెట్, నీట్ లాంటి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాక్టికల్స్లో మంచి మార్కులు రావాలంటే విశ్లేషణాత్మకంగా చదవాలి.
రికార్డులు రాయడం ఎంతో కీలకం
- మద్దినేని మురళీకృష్ణ
విద్యార్థులు రికార్డులు రాయడం, బొమ్మలు వేయడం చేయాలి. అధ్యాపకులు నేర్పించిన ప్రాక్టికల్స్ సాధన చేయడంతో పాటు విలువలను గణించడం, ప్రమాణాలు రాయడం అవసరం. వైవాకు మార్కులు కేటాయిస్తారు. చేసే ప్రయోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. చక్కగా సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.