‣ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల
భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు. సీడీఎస్ పరీక్ష యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ
మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.
దరఖాస్తు: వెబ్సైట్ http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.
అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జనవరి 1998 - 1 జనవరి 2003 మధ్య జన్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.