ధైర్యసాహసాలూ, అంకితభావం ఉన్న ఉత్సాహవంతులైన పట్టభద్రుల కోసం భారతీయ సాగర తీరదళం ఎదురుచూస్తోంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) / డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయులకు సమాన హోదాలో ఉండే ‘అసిస్టెంట్ కమాండెంట్’ ఉద్యోగానికి యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైతే నేరుగా గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు సొంతం చేసుకోవచ్చు.
ఎంట్రీ స్థాయిలోవైనప్పటికీ ఈ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు కీలకమైనవి. అందుకే ఎంపికైనవారిని నేవల్ అకాడమీలో శిక్షణ ద్వారా సుశిక్షితులుగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా సీనియర్ అధికారుల, నావికుల మార్గదర్శకత్వంలో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటం వీరి కర్తవ్యం. మంచి ఫిట్నెస్తో, ఉత్సాహంగా తీర రక్షణ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశలతో సంక్లిష్టంగా ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపికలు చేపడతారు. ముందుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మదింపు చేస్తారు. వీరికి స్టేజ్ -1 పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపికలో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు (పీపీ అండ్ డీటీ) ఉంటాయి.
ఆప్టిట్యూడ్ టెస్టు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు వస్తాయి. పీపీ అండ్ డీటీ కోసం ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడాలి. ఇందులో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి వ్యాఖ్యానించమంటారు.
స్టేజ్-1లో ఎంపికైనవారికి స్టేజ్-2 నిర్వహిస్తారు.ఇందులో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి.
స్టేజ్-2లోనూ ఎంపికైనవారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు మే, 2019లో కోస్టు గార్డు వెబ్ సైట్లో ప్రకటిస్తారు. వీరికి జూన్ ఆఖరు నుంచి ఇండియన్ నేవల్ అకాడెమీ (ఐఎన్ఏ), ఎజిమలలో శిక్షణ ప్రారంభమవుతుంది.
ఏ పోస్టుకు ఎవరు అర్హులు?
అసిస్టెంట్ కమాండెంట్లు (గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్)
1. జనరల్ డ్యూటీ (పురుషులు)
కనీసం 60 శాతం అగ్రిగేట్ మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివిఉండాలి. అభ్యర్థులు 01.07.1994 - 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.
2. జనరల్ డ్యూటీ (ఎస్ఎస్ఏ) మహిళలు
కనీసం 60శాతం అగ్రిగేట్ మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. . ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి. అభ్యర్థినులు 01.07.1994 - 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.
3. కమర్షియల్ పైలట్ ఎంట్రీ (ఎస్ఎస్ఏ) పురుషులు/ మహిళలు
మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో పన్నెండో తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థులు 01.07.1994 - 30.06.2000 మధ్య జన్మించి ఉండాలి.
4. లా- పురుషులు/ మహిళలు
కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ (లా) ఉత్తీర్ణులైవుండాలి. అభ్యర్థులు 01.07.1989 - 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.
అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ, లా విభాగాలకు పురుషులు 157, మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే అన్నింటినీ రద్దు చేస్తారు.
వీటిని తీసుకెళ్లాలి...
ప్రిలిమినరీ పరీక్షలకు వెళ్లినప్పుడే అడ్మిట్ కార్డు ప్రింటవుట్లు రెండు తీసుకుని వాటికి కలర్ పాస్పోర్టు పరిమాణం ఫొటోలు జతచేయాలి. 10, 12 (ఇంటర్), డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్, రిజర్వేషన్ ఉన్నవాళ్లు సంబంధిత (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. పరీక్ష తేదీకి ఆరు నెలల్లోపు తీసుకున్న క్యారక్టర్ సర్టిఫికెట్, ఇటీవల తీసుకున్న 12 పాస్పోర్టు పరిమాణం ఉన్న ఫొటోలు నీలం బ్యాక్ గ్రౌండ్తో ఉండేవి తీసుకెళ్లాలి. సర్టిఫికెట్లను పరిశీలించి పరీక్ష అనంతరం తిరిగి ఇచ్చేస్తారు. సర్టిఫికెట్లు లేకుండా పరీక్షకు అనుమతించరు.
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, పలు ఇతర అలవెన్సులు ఉంటాయి.
తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలు పొందవచ్చు. భారత సముద్రతీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దే్దేశం చేయాలి.
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18.11.2018.
చివరి తేదీ: 30.11.2018 సాయంత్రం 5 వరకు
ప్రవేశపత్రాలు: డిసెంబరు 9 నుంచి కోస్టుగార్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
స్టేజ్-1 ప్రాథమిక పరీక్ష: డిసెంబరు 17, 2018 - జనవరి 17, 2019 మధ్య ఎప్పుడైనా జరగవచ్చు.
పరీక్ష కేంద్రాలు: ముంబయి, చెన్నై, కోల్కతా, నోయిడాల్లో నిర్వహిస్తారు.
వెబ్సైట్: https://www.joinindiancoastguard.gov.in/