‣ ఎంపికైనవారికి ఉచితంగా బీటెక్
‣ అనంతరం సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగం
‣ నెలకు రూ.83 వేలకు పైగా వేతనం
‣ ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు అవకాశం
10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ఇండియన్ నేవీ. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్ అకాడెమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో నెలకు రూ.83 వేలకు పైగా వేతనంతో నేవీలోనే ఉద్యోగిగా కొనసాగవచ్చు. నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఎంపిక ఇలా:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ-2017 మెయిన్స్లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్లిస్టు చేస్తారు. జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించినవారే 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీంకు అర్హులు. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ)... బెంగళూరు, భోపాల్, కోయంబతూర్, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట జులై - అక్టోబరు మధ్య కాలంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిని రెండు దశల్లో చేపడతారు. మొత్తం 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజికల్ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తుదిదశ నియామకాలు చేపడతారు.
నేవీలో ఉద్యోగాలెన్నో...
శిక్షణ..
ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జులై 2018 నుంచి ప్రారంభవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు ఫీజు, భోజనం, వసతి, దుస్తులు..ఈ ఖర్చులన్నీ నేవీ భరిస్తుంది. కోర్సు అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. ఈ సమయంలో అన్నీ కలుపుకుని నెలకు రూ.83 వేలకు పైగా వేతనంగా పొందవచ్చు.
ఇవీ అర్హతలు
విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
వయోపరిమితి: 17 - 19 1/2 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే జనవరి 2, 1999 - జులై 1, 2001 మధ్య జన్మించినవాళ్లే అర్హులు.
ఇతర అర్హతలు: అభ్యర్థులు జేఈఈ మెయిన్ -2017 లో అర్హత సాధించినవారై ఉండాలి. మెయిన్లో సాధించిన ర్యాంకు ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన వారిని ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
దరఖాస్తులు
ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రింటవుట్లు తీసుకోవాలి. ఒక సెట్ ప్రింటవుట్ను రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలి. ఒక సెట్ ప్రింటవుట్ను ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు తీసుకుని వెళ్లాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: నవంబరు 30
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/